Trains Stoppages | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ రైళ్లు ఇకపై ఈ స్టేషన్లలోనూ ఆగుతయ్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను నాలుగు రైల్వేస్టేషన్లలో ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది

Trains Stoppages | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను నాలుగు రైల్వేస్టేషన్లలో ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. పలు రైళ్లను పలు స్టేషన్లలో ఆపాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నది. హైరా-పుదుచ్చేరి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ (12867-12868) రైలుకు రాజమండ్రిలో స్టాప్ పాయింట్ ఇచ్చారు. రామేశ్వరం – భువనేశ్వర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ (20895-20896)కు సైతం రాజమండ్రి రైల్వేస్టేషన్లో స్టాప్ ఇచ్చారు. హుబ్లీ నుంచి మైసూర్ వెళ్లే హంపి ఎక్స్ప్రెస్ (16591-16592) ఇకపై అనంతపురంలో ఆగనున్నదని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి రేపల్లె ఎక్స్ప్రెస్ (17645-17646) రైలు సిరిపురం స్టేషన్లో ఆగుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
దాంతో పాటు బల్లార్షా కాజీపేట ఎక్స్ప్రెస్కు రాఘవపురంలో, పుణే-కాజీపే ఎక్స్ప్రెస్కు మంచిర్యాలలో, దౌండ్-నిజామాబాద్ ఎక్స్ప్రెస్కు నవీపేటలో, భద్రాచలం రోడ్ – బల్లార్షా సింగరేణి మెము ఎక్స్ప్రెస్కు బేతపుడిలో స్టాప్స్ ఇచ్చారు. నర్సాపూర్ -నాగర్సోల్ ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, ఆదిలాబాద్ – తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్కు మేడ్చల్లో, సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్కు మిర్యాలగూడలో స్టాప్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్ప్రెస్కు తడికలపూడిలో.. రేపల్లె- సికింద్రాబాద్కు రామన్నపేట, పద్మావతి ఎక్స్ప్రెస్కు నెక్కొండలో, గుంటూరు – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్కు ఉందానగర్, కాజీపేట-బల్లార్షా ఎక్స్ప్రెస్కు రేచ్ని స్టేషన్లలో ఆగుతాయని వివరించింది. ఈ మేరకు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.