పురుషాంగం ఆకారంలో శివుడు.. ఆ ఆలయం ఎక్కడ ఉందంటే..?
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆ పరమేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆ పరమేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ప్రతి శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే శివాలయాల్లో పరశురాముడు స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది. ఈ ఆలయంలో శివుడి ఆకారం విచిత్రంగా ఉంటుంది. పురుషుడి లింగం ఆకారంలో ఉన్న శిలపై త్రిమూర్తులు దర్శనమిస్తారు. ఈ ఆలయం క్రీస్తు పూర్వం ఒకటో శతబ్దానికి చెందిన ఆలయంగా కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ శివలింగానికి మొట్టమొదటి శివలింగంగా కూడా పేరుంది. కానీ పరిశోధకులు ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ.. ఆలయంలోని శివలింగం మిస్టరీగానే మిగిలిపోయింది.
మరి ఆ ఆలయం ఎక్కడ ఉందంటే..?
ఆధ్యాత్మిక నగరి తిరుపతి నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు మండలం పరిధిలోని గుడిమల్ల గ్రామంలో ఆ శివాలయం ఉంది. పురుషాంగం ఆకారంలో ఉన్న శివలింగాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. మరి ఆ గ్రామానికి గుడిమల్లం అనే పేరు ఎందుకు వచ్చిందని స్థానికులను ప్రశ్నిస్తే.. గుడి ఎత్తులో ఉండి, ఆలయంలో శివలింగం కింది భాగంలో ఉండటంతో ఈ గ్రామానికి గుడిమల్లం అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. శాతవాహనులు, పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్య వంశీయులు ఈ ఆలయంలో స్వామి వారి సేవలో తరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వర్ణముఖి నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటో శతాబ్దానికి చేందిన అతి ప్రాచిన శివాలయాన్ని పరశురామాలయంగా కూడా పిలుస్తారు. అద్భుతమైన శిల్ప శోభితమైన ఆలయం చాలా కాలం వరకూ కాలగర్భంలో కలిసి పోయింది. 1911లో గోపినాధరావు అనే పురాతత్వ వేత్త ఓ ఏడాది పాటు పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి తెలియజేశారు. ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాని పోలి ఉండే.. ఏడు అడుగుల ఒకే శిలపై.. త్రిమూర్తులు కనిపిస్తారు.
ఆలయ చరిత్ర
పరశురాముడు తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరచ్ఛేదనం చేసినందుకు.. ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను రుషులు ఒక శివలింగం వెతికి దానికి పూజించవలసిందిగా సూచిస్తారు. ఈ క్రమంలో అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి.. అటువైపు ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి.. ప్రతిరోజు ఆ చెరువులో ఒక దైవ పుష్పంతో అతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడడం కోసం పరశురాముడు యక్షుడిని(చిత్రసేనుడు) కాపలాగా ఉంచుతాడు. అందుకుగాను పరుశురాముడు రోజు అతనికి ఒక జంతువును బలి ఇచ్చేవాడు. ఒకరోజు పరశురాముడు పూజకు ఆలస్యంగా రావడంతో చిత్ర సేనుడు ఆ పుష్పంతో శివుని పూజలు నిర్వహిస్తారు. అయితే పరశురాముడు వచ్చే సరికే చెరువులో పుష్పం లేకపోవడంతో కోపోద్రిక్తుడై.. చిత్రసేనుడు మీద దండెత్తాడు ఇలా 14 సంవత్సరాల పాటు కొనసాగిన యుద్ధం వల్ల ఆ ప్రదేశం మొత్తం పల్లంలా మారినందుకు గుడి పల్లంగానూ, కాలానుగుణంగా ఆ ప్రదేశానికి గుడిమల్లంగా పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు. ఆ యుద్ధం ఎంతకీ సమాప్తం కాకపోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్షమై వారిని శాంతింప పరిచి వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతారు. అందుకే ఇక్కడ ఒకే శిలలో త్రిమూర్తులు కొలువై ఉండటం బహుశా.. దేశంలోనే ఎక్కడా కనిపించదు. బ్రహ్మా యక్షుడి రూపంలో రూపంలో, విష్ణుమూర్తి పరుశురాముని రూపంలో విష్ణువు, పురాణలింగాకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తారు.