విధాత: సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీరని నష్టం కలిగింది. ఆంధ్రాకు వెళ్లాల్సిన 700 మంది ఆంధ్రా ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి రావడంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో తెలంగాణ ఉద్యోగులకు భారీగా రివర్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీ డీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లలో 700 మంది ఆంధ్ర ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు విద్యుత్ సంస్థలు నియమ నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాయి.
అద్భుతంగా పని చేస్తున్న విద్యుత్ సంస్థల్లోకి ప్రవేశించడం కోసం కేసులపై కేసులు వేసి ఇక్కడ మకాం వేయడానికి ఆంధ్రా ఉద్యోగులు సిద్దమయ్యారు. దీంతో 172 మంది ఇంజినీర్లతో పాటు మొత్తం 250 మంది తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏర్పడింది. ఫలితంగా ప్రమోషన్లు కోల్పోయిన వారిలో సీఈలు, ఎస్ఈలు, డీఈలు ఉన్నారు. తమకు రివర్షన్లు ఇవ్వడంపై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.