Gurukul Students
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్టల్లో మద్యం తాగి అది చూసి మందలించిన టీచర్ పైన్నే తప్పును నెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అధికారుల పరిశీలనతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా మల్లంపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి సేవిస్తున్నప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుడు చూసి మందలించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని విద్యార్థులతో లెటర్ రాయించుకున్నారు.
ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు విద్యార్థులు ఎవ్వరికి చెప్పకుండా పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అర్ధాంతరంగా ఇంటికి వచ్చిన తమ పిల్లలని తల్లిదండ్రులు అడగడంతో వ్యాయామ ఉపాధ్యాయుడే మందుకొట్టి తాము తాగినట్లు తమతో లెటర్ రాయించుకున్నారని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పారు.
విద్యార్థుల మాటలు నమ్మిన తల్లిదండ్రులు ఆ మరుసటి రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగడంతోపాటు, సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కో-ఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామికి మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై స్పందించిన అధికారులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టగా నిజాలు వెలుగు చూశాయి. తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని విచారణలో వెల్లడైంది. శనివారం రాత్రి మద్యం దుకాణంలో విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా బయటపడింది.
అయితే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్ధులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపాల్ అంకయ్య తెలిపారు. మైనర్ పిల్లలకు మద్యం విక్రయించినందుకు స్థానిక వైన్ షాప్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.