బీజేపీ ఫ్లెక్సీలను దహనం చేసిన బీఆర్ఎస్వీ నాయకులు కేంద్రం ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ 11 మంది విద్యార్థి నాయకుల అరెస్ట్ ధర్మసాగర్ పీఎస్కు తరలింపు అప్రమత్తమైన పోలీసులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద చేపట్టిన నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒకవైపు బిజెపి ర్యాలీకి సిద్ధమవుతుండగా మరోవైపు బీఆర్ఎస్వీ విద్యార్థులు ఆందోళన చేపట్టడం పోలీసులను కలవరపరిచింది. నిరసనలో భాగంగా […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద చేపట్టిన నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒకవైపు బిజెపి ర్యాలీకి సిద్ధమవుతుండగా మరోవైపు బీఆర్ఎస్వీ విద్యార్థులు ఆందోళన చేపట్టడం పోలీసులను కలవరపరిచింది. నిరసనలో భాగంగా బీఆర్ఎస్వీ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో వరంగల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు.
బిజెపికి మార్చ్ నిర్వహించే అర్హత లేదు
బీజేపీ ఫ్లెక్సీలను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు యత్నించారు. ఈక్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని, నిరుద్యోగ మార్చ్ అడ్డుకుంటామని హెచ్చరించారు.
నిరసనకారుల అరెస్ట్
బిజెపి నిరుద్యోగ మార్చుకు నిరసనగా ఆందోళన చేపట్టిన 11 మంది నిరసనకారులను పోలీసులు ఆరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బిజెపి ర్యాలీ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బిజెపి ర్యాలీ కూడా కేయూ నుంచి ప్రారంభం కానున్నది.
మూడు గంటలకు బిజెపి ర్యాలీ ప్రారంభం
బీజేపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు హన్మకొండలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు.
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్పంప్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ.. దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది.
ఈ నేపథ్యంలో ర్యాలీ సాగే ప్రాంతాలలో పోలీసులు నిఘా తీవ్రం చేశారు. అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.