ఆ భూములపై పూర్తి హక్కు మఠానిదే.. తేల్చేసిన సుప్రీంకోర్టు ఉదాసిన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ (ఐడీయల్ కెమికల్స్) కేసులో సుప్రీం తీర్పు యాజమాన్య హక్కుల కోసం ప్రయత్నించిన ఐడీయల్ కెమికల్స్ ‘గల్ఫ్ ఆయిల్’ నిబంధనలు ఉల్లఘించిందంటూ మఠం, దేవాదాయ శాఖ న్యాయ పోరాటం దేవాదాయ శాఖ అధికారులు, న్యాయవాదులను అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విధాత, హైదరాబాద్: హైదరాబాద్ నగర నడి బొడ్డున 15వేల కోట్ల విలువైన కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న […]
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ నగర నడి బొడ్డున 15వేల కోట్ల విలువైన కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠంవే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉదాసిన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ (ఐడీయల్ కెమికల్స్) కేసులో మంగళవారం (సెప్టెంబర్ 13) తీర్పు వెలువరించింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మఠం భూములను 1964, 1966, 1969, 1978 లో నాలుగు దఫాలుగా బఫర్ జోన్లో ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్కు 99 సంవత్సరాల కాల వ్యవధికి లీజుకిచ్చింది. అయితే బఫర్ జోన్లో ఉన్న ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని సవాలు చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది.
ఈ పిటిషన్ విచారించిన ట్రిబ్యునల్ 2011 సంవత్సరంలో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్కు ఇచ్చిన లీజును రద్దు చేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా… 2013లో ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2013లో స్టేటస్ కో మేయింటెన్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
మంగళవారం పిటిషన్ విచారణకు రాగా.. గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ దాఖలు చేసిన పిటిష్న్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విలువైన భూములను కాపాండేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ తరపున వాదించిన న్యాయవాదులను మంత్రి అభినందించారు.
దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే చెందుతాయని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసినట్లైందని, ఇదే స్పూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూములను స్వాదీనం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను తాజా తీర్పును అనుసరించి త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చొరవ చూపాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ సుమారు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా.