విధాత, హైదరాబాద్ : ధరణి భూ వివాదాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు మార్చి 1నుంచి 9వరకు తాసిల్దార్ కార్యాలయాల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించింది. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు నిర్ణీత గడువు విధించింది. ఎట్టిపరిస్థితుల్లో దరఖాస్తులేవీ పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేసింది. ఏ స్థాయిలో ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో కాల పరిమితిని కూడా నిర్దేశించింది. తాసిల్దార్ ఏడు రోజుల్లో, ఆర్డీవో మూడు రోజుల్లో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) 3రోజుల్లో, కలెక్టర్ 7 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ధరణి సమస్యల పరిష్కార అధికారాలను ప్రభుత్వం తాసిల్దార్లు, ఆర్డీవోలకు, కలెక్టర్లకు బదలాయించింది. తాసిల్దార్లు, ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు, సీసీఎల్ఏకు అధికారాలను బదలాయిస్తునట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో గురువారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఫిబ్రవరి 24వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ధరణి కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం కలెక్టర్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ బృందాలను ఏర్పాటు చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తులతో వచ్చిన పత్రాలన్నింటినీ తనిఖీ చేయాలి. అందులో ఏమైనా లేకపోతే ఫిర్యాదుదారుడి నుంచి తీసుకోవాలి. తాసిల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు.. మొత్తం దరఖాస్తులను పరిష్కరించాలి. ఏ ఒక్కటీ పెండింగ్లో ఉంచకూడదు. సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కాలపరిమితికి కట్టుబడి ఉండాలి. పరిష్కరించిన అంశాలు, జారీ చేసిన ఉత్తర్వులు ఎలక్ట్రానికల్గా రికార్డు చేసి ఉంచాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలి. భాగస్వాములకు ఇబ్బందుల్లేకుండా పెండింగ్ రెవెన్యూ అంశాలు పరిష్కరించాలి.
నిర్దిష్ట మాడ్యూళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించే నిమిత్తం తహసీల్దారుకు బదలాయించాలి. తాసిల్దార్ ప్రాథమిక రికార్డులైన శేత్వార్, ఖాస్ర పహాణి, సెస్సాల పహాణీ, అందుబాటులో ఉన్న పాత పహాణీలు, డాక్యుమెంట్లను, ఆర్వోఆర్ రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలి. క్షేత్రస్థాయి సిబ్బంది విచారణ జరిపి, తాసిల్దార్కు నివేదిక సమర్పించాలి. ఆ విచారణ నివేదిక, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తాసిల్దార్ ఆర్డర్ను అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తును ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాల్సి ఉంటుంది. తిరస్కరించిన పక్షంలో తాసిల్దార్ తగిన కారణాన్ని చూపాలి. ఆర్డీవో స్థాయిలో కొన్ని మాడ్యూళ్ల పరిష్కారం ఉంటుంది. అన్ని పెండింగ్ దరఖాస్తులను విచారణ నిమిత్తం తాసిల్దార్కు పంపాలి.
తాసిల్దార్ సిఫారసులను తనిఖీ చేసుకుని వాటిని ఆమోదించం లేదా తిరస్కరించడం చేయాలి. తిరస్కరించిన పక్షంలో ఆర్డీవో తగిన కారణాన్ని చూపాలి. కే అండ్ ఎల్ మాడ్యూల్కు సంబంధించి ఫైనల్ అప్రూవల్ అథార్టీగా ఉంటారు. కే అండ్ ఎల్ ఫాం దరఖాస్తులు ఎంక్వైరీ కోసం ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. ఆర్డీవో వాటిని వెరిఫై చేసి, కలెక్టర్ లాగిన్కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి ఆర్డీవోకు నివేదిక ఇవ్వాలి. ఆర్డీవో సిఫారసుల ఆధారంగా కలెక్టర్ ఆ దరఖాస్తులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తిరస్కరించిన పక్షంలో సహేతుకమైన కారణాన్ని చూపాల్సి ఉంటుంది.