2014లో బాలిక‌పై రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే దోషి

తొమ్మిదేండ్ల‌ క్రితం బాలికపై లైంగిక‌దాడి చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని దుద్ది అ బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను స్థానిక కోర్టు దోషిగా నిర్ధారించింది

2014లో బాలిక‌పై రేప్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే దోషి
  • దుద్ది నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే
  • రామ్‌దుల‌ర్ గోండ్‌పై న‌మోదైన
  • రేప్ కేసులో 15న‌ తుది తీర్పు



విధాత‌: తొమ్మిదేండ్ల‌ క్రితం బాలికపై లైంగిక‌దాడి చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను స్థానిక కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది. శిక్షను ఈ నెల 15న ప్ర‌క‌టిస్తాన‌ని తీర్పును రిజ‌ర్వు చేసింది.


2014లో బాలిక‌పై రేప్ కేసులో అదనపు జిల్లా జడ్జి (ప్రథమ), ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఎహసాన్ ఉల్లా ఖాన్,.. ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పోక్సో) సత్యప్రకాష్ త్రిపాఠి తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేను కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పేర్కొన్నారు. బాలిక‌పై లైంగిక‌దాడి ఘటన 2014 నవంబర్ 4న జరిగిందని, ఎమ్మెల్యేపై 376 (అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష, 5L/6 రక్షణ, పిల్లలు లైంగిక నేరాల (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని త్రిపాఠి తెలిపారు.


ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే భార్య గ్రామ ప్రధాన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మైయర్‌పూర్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖ‌లు చేశారు. ఆ సమయంలో గోండు ఎమ్మెల్యే కాదు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. తొలుత‌ పోక్సో కోర్టులో కేసు విచారణ కొన‌సాగ‌గా, గోండు ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌ కేసు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. కోర్టులో నేరం రుజువు కావ‌డంతో గోండును ధ‌ర్మాస‌నం దోషిగా తేల్చింది. తుది తీర్పును 15న ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.