కేరళ: అనంత పద్మనాభస్వామి.. అంగరక్షకుడు ‘శాఖాహార మొసలి’ మృతి
విధాత: శాఖాహార మొసలి మృతికి సంబంధించిన వార్త గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అనంత పద్మనాభ స్వామి దేవాలయ కొలనులో ఉండే ఆ మొసలి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని మృతి చెందిన శాకాహార మొసలి గురించి అక్కడి వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు ఇవే.. కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లా కుంబ్లా పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయ కొలనులో మొసలి దశాబ్దాలుగా నివసిస్తున్నది. అది ఆదివారం […]

విధాత: శాఖాహార మొసలి మృతికి సంబంధించిన వార్త గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అనంత పద్మనాభ స్వామి దేవాలయ కొలనులో ఉండే ఆ మొసలి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని మృతి చెందిన శాకాహార మొసలి గురించి అక్కడి వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలు ఇవే..

కేరళ రాష్ట్రం కాసరగోడ్ జిల్లా కుంబ్లా పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయ కొలనులో మొసలి దశాబ్దాలుగా నివసిస్తున్నది. అది ఆదివారం అర్ధరాత్రి చనిపోయింది. స్థానికులు ‘బాబియా అని ముద్దుగా పిలుచుకునే ఈ శాకాహార మొసలి శనివారం నుంచి కనిపించకుండా పోయినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

ఆ తర్వాత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో కొలనులో కళేబరం తేలియాడుతూ కనిపించిందని తెలిపారు. వెంటనే ఆలయ అధికారులు పోలీసులకు, పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందించారు. 70 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న ఈ మొసలి శాకాహారి అని, ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్నిమాత్రమే తిని జీవించినట్లు పేర్కొన్నారు.

ఈ మొసలి నీటిలోని చేపలను తినదు. నైవేద్య సమయానికి దేవాలయంలోకి వచ్చి భక్తులని ఇబ్బంది పెట్టకుండా స్వామి వారి దర్శనం చేసుకుని నైవేద్యం స్వీకరించి మరలా కోనేరులోకి పయనించేది. ఆలయ పూజారి పెట్టే రెండు కేజీల బెల్లం పరమాన్నం మాత్రమే తింటుంది.

ప్రతి రోజు ఆలయ పూజారి భోజనం పెట్టె రేండు సార్లు మాత్రమే ఆ మొసలి సరస్సు నుంచి బయటికి వస్తుంది. దాదాపు గత 70 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఈ మొసలి అనంత పద్మనాభుడి అంగరక్షకుడని భక్తులు భావిస్తున్నారు.

మొసలి కళేబరాన్ని కొలను నుంచి తీసి సోమవారం ప్రజల సందర్శనార్థం ఆలయ పరిసరాల్లో ఉంచారు. దశాబ్దాలుగా ఈ కొలనులో మొసలి ఒంటరిగానే ఉండేది. తాము చూసినంత వరకూ ఇది ఈ కొలనులో నివసించిన మూడో మొసలి అని, గతంలో ఇక్కడ ఉండే మొసలి మరణించగానే మరొకటి అనూహ్యంగా ప్రత్యక్షమయ్యేదని, ఈ పరంపర ఇలాగే కొనసాగుతున్నదని పెద్దలు చెప్పేవారని ఆలయ వెబ్సైట్లో వెల్లడించారు.
