విధాత: కొత్త డ్రెస్ మోజులో ఒక మహిళ తాళిబొట్టునను పొగొట్టుకున్న సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. పంజాగుట్టలోని ఒక షాపింగ్ మాల్కు షాపింగ్ చేయడానికి వచ్చిన ఓ మహిళ ట్రయల్ రూమ్లో డ్రెస్సులు మార్చుకునే సమయంలో తాళిబొట్టు తీసి పక్కన పెట్టింది.
కొత్త డ్రెస్సు ట్రయల్ మోజులో ఉన్న సదరు మహిళ ఆ మంగళసూత్రం సంగతి మరిచిపోయింది. ఆ తర్వాత తేరుకుని వెళ్లి చూస్తే అది మాయమైంది. షాపింగ్ మాల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. 6 తులాల మంగళసూత్రం పోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఘటన జరిగిన ఫ్లోర్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయక పోవడం కొసమెరుపు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.