లోక్సభ ఎన్నికలలో ఓటమి భయంతో అసహనంతో కాంగ్రెస్ పార్టీ నాపై రిజర్వేషన్లను రద్ధు చేస్తానంటూ చెప్పినట్లుగా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు
విధాత, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలలో ఓటమి భయంతో అసహనంతో కాంగ్రెస్ పార్టీ నాపై రిజర్వేషన్లను రద్ధు చేస్తానంటూ చెప్పినట్లుగా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియతో మాట్లాడుతూ బీజేపీ విజయం ఖామయన్న అసహనంతోనే కాంగ్రెస్ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని మండిపడ్డారు. నా మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. 400 సీట్లు దక్కించుకున్న తర్వాత బీజేపీ రిజర్వేషన్లను రద్దుచేస్తుందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ మాటలన్నీ నిరాధారమైనవని, మా నినాదాలను తప్పదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు మా పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లను పరిరక్షిస్తుందని స్పష్టం చేశారు నాతోపాటు మా పార్టీకి చెందిన ఇతర నేతల నకిలీ వీడియోలను ప్రచారం చేసే స్థాయికి కాంగ్రెస్ వారిలో అసహనం పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు ఈ ఫేక్ వీడియోను వ్యాప్తి చేశారని, ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖనేత క్రిమినల్ నేరాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. ఇవన్నీ వారి అసంతృప్తిని వెల్లడిచేస్తున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలను మరింత దిగజార్చేపనిలో ఉన్నారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. ఫేక్ వీడియో తరహా దృశ్యాలను ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ ప్రధాన పార్టీ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని అమిత్ షా స్పష్టం చేశారు.
కర్ణాటకలో తమ మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబందించినవిగా చెప్తున్న అభ్యంతరకర వీడియోలపై విచారణ జరిపి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. దేశంలో మేం మాతృ శక్తికి అండగా నిలుస్తామన్నది స్పష్టమన్నారు. రేవణ్ణ వీడియో వ్యవహారంపై అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సమస్య ఆ రాష్ట్ర శాంతిభద్రతల అంశమని, మేం విచారణకు అనుకూలంగా ఉన్నామని, ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని జేడీఎస్ కూడా ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. అమేథీ, రాయబరేలీలో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ పోటీ గురించి అడగ్గా “వారు బరిలో ఉంటారా? లేదా? అనేది తేలీదని, అయితే వారిలో గందరగోళం చూస్తుంటే వారు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా కనిపిస్తుందని, వారు తమ సొంత సీట్ల వదిలి పారిపోయారని ఎద్దేవా చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందని, సీట్లు కూడా పెరుగుతాయని జోస్యం చెప్పారు. తొలి రెండు విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో గెలుస్తోందని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. 400 సీట్లలో ఎన్డీఏ విజయంతో మోదీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.