అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతం భక్తులు పోటెత్తుతున్నారు.
Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతం భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు బాల రామయ్యను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం బాల రామయ్యకు రూ.3500కోట్లు సమకూరాయి. దేశ విదేశాల నుంచి రామ భక్తులు మందిర నిర్మాణానికి భారీగా విరాళాలు అందించారు. ప్రాణ ప్రతిష్ఠ రోజునే రామ్లల్లాకు రూ.3.17కోట్ల విరాళం అందింది. పాట్నాలోని మహావీర్ టెంపుల్ ద్వారా రామమందిరానికి రూ.10 కోట్లు విరాళంగా అందజేసింది.
మహావీర్ ఆలయం వరుసగా 2020 నుంచి 2024 వరకు రామాలయం కోసం రూ.2కోట్ల చొప్పున విరాళం అందించింది. ఈ విరాళం ఏ మతపరంగానైనా ఇదే అతిపెద్ద విరాళం. మహావీర్ టెంపుల్ నుంచి బంగారు విల్లు, బాణం సైతం కానుకగా ఇచ్చింది. ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు తన భక్తుల తరఫున రామమందిరం ట్రస్టుకు రూ.11 కోట్లు అందజేశారు. అలాగే, గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్భాయ్ ధోలాకియా మరో రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరమల్తో కలిసి జనవరి 22న ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరైన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం రూ.2కోట్ల వరకు నిధులను ఇచ్చినట్లు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారం విలువ రూ.68కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారాన్ని తలుపులు, వివిధ వాటికి ఉపయోగించినట్లు తెలుస్తున్నది.
సూరత్కు చెందిన వ్యాపారవేత్త ముఖేష్ పటేల్ విలువైన రాళ్లతో పొదిగిన రూ.11 కోట్ల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని బాలక్ రాముడికి కానుకగా సమర్పించారు. ఇందులో ఆరు కిలోల బంగారం ఉండగా.. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లను పొదిగారు. రామ మందిరం నిర్మాణ సమయంలో ట్రస్ట్ 2022లో 45 రోజుల పాటు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. భక్తుల నుంచి రూ.10 నుంచి రూ.100, రూ.1000 రసీదుల ద్వారా దేశంలోని 13కోట్ల కుటుంబాలు విరాళాలు సమర్పించాయి. అప్పట్లోనే రూ.3500కోట్ల విరాళాలు వచ్చాయి.