విధాత: ఇటీవల కొందరు సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందల కోట్లు జమ అవుతున్నాయి. ఎక్కడి నుంచి ఎవరి ఖాతాల్లో జమ అవుతున్నాయో తెలియక ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్నది. సామాన్య ఫార్మసీ ఉద్యోగి ఖాతాల్లో రూ.753 కోట్లు నిల్వ చూపడం షాక్కు గురిచేసింది.
చెన్నైకి చెందిన ఫార్మసీ ఉద్యోగి ముహమ్మద్ ఇద్రిస్ తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుంచి శనివారం స్నేహితుడికి రూ.2000 డబ్బు పంపాడు. తర్వాత తన బ్యాంకు బ్యాలెన్స్ను పరిశీలించగా, రూ.753 కోట్లు ఉన్నట్లు తెలుసుకొని షాక్కు గురయ్యాడు. ఇద్రిస్ వెంటనే ఈ విషయాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. బ్యాంక్ అధికారులు ఖాతాను స్తంభింపచేశారు. సాంకేతిక లోపం కారణంగా ఈ నగదు జమ అయినట్టు తెలిపారు.
తాజాగా చెన్నైలోని ఓ ట్యాక్సీ డ్రైవర్ స్నేహితుడి ఖాతాకు రూ.21 వేలు ట్రాన్స్ ఫర్ చేయగా, రూ.9 వేల కోట్లు అతని బ్యాంకు ఖాతాలో జమ ఉన్నట్టు తెలియడంతో షాక్కు గురయ్యాడు. 30 నిమిషాల తర్వాత, బ్యాంక్-తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్- తమ తప్పును గ్రహించి, మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నది.