విధాత, హైదరాబాద్ : ఢిల్లీ(Delhi Red Fort Explosion) ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది(12 dead). 9 మంది ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా..మరో 20 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురు మంగళవారం ఉదయం మరణించడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. ఓ రన్నింగ్ కారులో పేలుడు సంభవించడంతో పేలుడు ధాటికి పలువురు మృతదేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి. వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పేలుడు సంభవించిన కారు పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారులో ఉన్న పుల్వామాకు చెందిన నిందితుడు డా.ఉమర్ మహ్మద్(Pulwama doctor Umar Ahmed)కు పేలుళ్లకు డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు నిందితులు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉందని.. ప్రమాదానికి కొంత సమయం ముందే అక్కడి నుంచి బయల్దేరినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు సంబంధించి సూచనల కోసం వారు అక్కడ ఎదురుచూసినట్లు తెలుస్తోందన్నారు. నిందితుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా తెలిపారు.
నిందితుడు పుల్వామా డాక్టర్ ఉమర్
పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ అహ్మద్ తల్లిదండ్రులు జీహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానోలకు 1989లో జన్మించాడు. ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి.. దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ (మెడిసన్) పూర్తి చేశాడు. కొన్నాళ్లు.. జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడని దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
మూడు రోజులు ఎర్రకోట మూసివేత
ఢిల్లీ పేలుడు ఘటన కారణంగా ఎర్రకోటను నవంబర్ 13 వరకు మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.
పేలుడు ఘటనపై దర్యాప్తుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూసివేత నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటలో పేర్కొంది. మరోవైపు ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. దర్యాప్తు వివరాల పురగతిని అమిత్ షా అధికారులో సమీక్షిస్తున్నారు.
