Heat wave | రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకుతోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. మండుటెండలు, వడగాల్పులకుతోడు ఉక్కపోత కూడా తీవ్రమవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Heat wave : రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకుతోడు వడగాల్పులు కూడా వీస్తుండడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. మండుటెండలు, వడగాల్పులకుతోడు ఉక్కపోత కూడా తీవ్రమవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నెల 6 వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ హెచ్చరించింది. హీట్ వేవ్ హెచ్చరిక ఉన్నన్ని రోజులు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైనే రికార్డవుతాయని తెలిపింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. మరో నాలుగు రోజుల్లో 49 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తెలంగాణలోని దాదాపు 22 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది. గత ఏడాది మే నెలతో పోల్చితే ఈసారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అటు వైద్య నిపుణులు, ఇటు వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పులకు పలువురు మృత్యువాతపడుతున్నారు. వడదెబ్బతో ప్రతి రోజూ నలుగురైదుగురు చనిపోతున్నారు.
ఈసారి ఎండలు వందేళ్ల రికార్డును బ్రేక్ చేశాయి. 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ 103 ఏళ్లలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. మే నెలలో తొలిరోజు నుంచే భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. వచ్చే ఐదు రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఎండలు కేవలం తెలుగురాష్ట్ర్లాల్లోనో, భారతదేశంలో మాత్రమేనో లేవు. ఆసియా ఖండం అంతటా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.