దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో చోటుచేసుకొన్న అవకతవకలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 7: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో చోటుచేసుకొన్న అవకతవకలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆమె శుక్రవారం ట్విట్టర్లో స్పందించారు. ‘మొదట నీట్ పేపర్ లీకైంది. ఇప్పుడేమో పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి గురించి మేనేజ్మెంట్ ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఒకటే పరీక్షాకేంద్రంలో ఆరు మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వచ్చాయని చాలామంది నీట్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షల నిర్వహణ మేనేజ్మెంట్ మాత్రం స్పందించటంలేదు’ అని విమర్శించారు.
నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘లక్షల మంది విద్యార్థుల గొంతుకలను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది. నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్పై విద్యార్థులు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై దర్యాప్తు నిర్వహించటం ప్రభుత్వ బాధ్యత కాదా? ఫిర్యాదులను పరిష్కరించటం ప్రభుత్వ బాధ్యత కాదా?’ అని నిలదీశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఈసారి నిర్వహించిన నీట్ పరీక్ష మొదటి నుంచీ వివాదాస్పదమైంది. మొదట పేపర్ లీకైంది. ఆ తర్వాత పరీక్ష ఫలితాలు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈసారి నీట్ పరీక్షలో ఏకంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 వచ్చాయి. వీరిలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన ఆరుగురు ఉన్నారు. దీంతో పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఎన్టీయే తోసిపుచ్చింది.