Agni-Prime Missile | భారత్ అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్

భారత్‌ రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్ష చేసి రక్షణ శక్తిని మరింత బలోపేతం చేసింది.

Agni-Prime Missile | భారత్ అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్

న్యూఢిల్లీ : భారత్‌ దేశంం తొలిసారి రైలు పైనుంచి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించే సామర్ధ్యం పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికే అగ్ని-పి క్షిపణి సామర్థ్య పరీక్షలు విజయవంతం చేసిన భారత్ తాజాగా అగ్ని ప్రైమ్‌ క్షిపణి పరీక్షలు పూర్తి చేసి రక్షణ రంగంలో కీలక పురోగతి సాధించింది.

అణుసామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్‌ క్షిపణిని రైలుపైనుంచి ప్రయోగించి పరీక్షించినట్లుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. భారత్ రక్షణ రంగంలో ఇది మరో మైలు రాయి వంటిదన్నారు. భారత్ ఆయుధ శక్తిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ పరీక్షలను విజయవంతం చేసిన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ను అభినందించారు.

అతితక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్‌ లాంఛింగ్‌ మిస్సైల్ వ్యవస్థ అగ్నిప్రైమ్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణి పరీక్షలు చేపట్టామని…రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి.. తక్కువ రియాక్షన్‌ టైమ్‌లో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చు అని రాజ్ నాధ్ సింగ్ పేర్కొన్నారు.

అగ్ని ప్రైమ్ మిస్సైల్ లో రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత ఇనర్షల్‌ నేవిగేషన్‌, మైక్రో ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌లను అమర్చారు. జీపీఎస్‌, నావిక్‌ శాటిలైట్‌ నేవిగేషన్లకు కూడా వాడుకొనే ఆప్షన్‌ ఇందులో ఉంది. ఈ మిసైల్‌కు ఉన్న కెనిస్టర్‌ డిజైన్‌ కారణంగా తేలిగ్గా ఎక్కడికైనా రవాణా చేసి భద్రపర్చవచ్చు. ఇది లాంఛింగ్‌కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.