స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలు జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది
ISI mark : స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలు జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తి నాణ్యతను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) శుక్రవారం తెలిపింది.
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT).. ఈ ఏడాది మార్చి 14న వంట పాత్రలకు ISI గుర్తును తప్పనిసరి చేస్తూ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ను జారీ చేసింది. ఈ ISI గుర్తును BIS అభివృద్ధి చేసింది. ఈ గుర్తు ఉత్పత్తి నాణ్యతను తెలుపుతుంది. భద్రతకు హామీ ఇస్తుంది.
BIS ప్రకారం.. స్టాండర్డ్ మార్క్ లేని స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రల తయారీ, దిగుమతి, అమ్మకం, పంపిణీ, నిలువ, ఎగ్జిబిషన్ను తాజా ఆర్డర్ నిషేధిస్తుంది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తి సమగ్రతకు ప్రభుత్వ నిబద్ధతను ఈ ఆర్డర్ నొక్కి చెప్పింది. ఆర్డర్ను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించబడుతాయని తెలియజేసింది.
స్టెయిన్లెస్ స్టీల్ కోసం IS 14756:2022, అల్యూమినియం పాత్రలకు IS 1660:2024 మార్కులను ముద్రించాలని సూచించింది. బీఐఎస్ ప్రమాణాలు ఉత్పత్తి అవసరాలు, డిజైన్ లక్షణాలు, పనితీరు పారామితులను కవర్ చేస్తాయి. ఇది వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని, తయారీదారులను ఉత్తమ పద్ధతులను అనుసరించే దిశగా నడిపిస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది.