విధాత: ఆలయాల్లోని ఏనుగులు మనుషుల శిక్షణతో చాల తెలివిగాను వ్యవహరిస్తుంటాయి. నిత్యం మనుషులు, భక్తుల మధ్య ఉండే ఆలయాల ఏనుగులు వారితో ఎలా మసలుకోవాలో మంచి అవగాహనతో వ్యవహరిస్తుంటాయి. ఒక్కోసారి చాల అరుదుగా వాటికి తిక్కరేగిపోయి భక్తులపై వీరంగం చేస్తుంటాయి. ఎక్కువ శాతం మాత్రం ఆలయాల ఏనుగులు ప్రశాంతంగానే తన జీవితకాలం దైవ సేవలో కొనసాగుతుండటం చూస్తుంటాం. అయితే తాజాగా ఓ ఆలయంలోని ఏనుగు పాల్పడిన అనూహ్య చర్యకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కుక్కే పట్టణంలోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయ ఏనుగు యశస్విని ఇటీవల ఆలయంలోని నీటి ఉత్సవం సంబరాల్లో మునిగి తేలింది. ఉత్సవంలో భాగంగా యశస్విని ఏనుగుపై భక్తులు నీళ్లను చల్లుతున్నారు. అయితే వారంతా ఏనుగు ముందుకు దూసుకురాకుండా ఓ పోలీస్ అదుపు చేసే విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో ఏమనిపించిందో ఏమోగాని భక్తులకు, నాకు మధ్య నువ్వెందుకన్నట్లుగా..యశస్విని ఏనుగు అకస్మాత్తుగా పోలీసును తన తొండంతో ఎత్తి పక్కన పడేసింది. అక్కడున్న భక్తులు ఇదంతా ఏమి పట్టించుకోకుండా ఏనుగుపై నీళ్లు చల్లడంలో పోటీ పడ్డారు. ఏనుగు యశస్విని సైతం భక్తుల చల్లే నీటితో ఎంజాయ్ చేస్తూ సంబరపడింది. అయితే ఈ వేడుకలో కూరలో కరివేపాకులా మారిపోయిన పోలీసును చూసి అంతా జాలి పడ్డారు.

కుక్కే ఆలయానికి బళ్లారి జిల్లా హెస్పేట్ కు చెందిన బీఎస్.అనంద్ సింగ్ అనే వ్యాపార వేత్త ఆసియా ఆడ ఏనుగు(ఎలిఫాస్ మాగ్జిమస్) యశస్వినిని రూ.20లక్షలు వెచ్చించి విరాళంగా అందించారు. నేపాల్ సరిహద్దులోని గోపాల్ గంజ్ నుంచి తీసుకవచ్చి అస్సాంలోని ఏనుగుల సంతలో విక్రయానికి వచ్చిన మూడున్నరేళ్ల ఏనుగు యశస్వీనిని ఆయన కొనుగోలు చేసి ఆయాలనికి విరాళంగా ఇచ్చారు. పదిహేనేళ్లకు పైగా యశస్విని కుక్కే శ్రీ సుబ్రమణ్యస్వామి సేవలో కొనసాగుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి :

Hyderabad : రోడ్డు ప్రమాదాలపై యమధర్మరాజు ప్రచారం..వైరల్
Sandhya Theatre Stampede| సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు నేటితో ఏడాది!