Sandhya Theatre Stampede| సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు నేటితో ఏడాది!

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నేడు గురువారంతో ఏడాది పూర్తయ్యింది. తొక్కిసలాట దుర్ఘటనలో తన కళ్ల ముందే తల్లిని కోల్పోయిన పదేళ్ల శ్రీతేజ్ తానూ తీవ్ర గాయాలపాలై నేటికి మంచం మీద నుంచి కదల్లేకపోతున్నాడు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Dec 06, 2025, 5:19 pm IST
Read Time: 4 mins
Sandhya Theatre Stampede| సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు నేటితో ఏడాది!

విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పుష్ప-2 సినిమా(Pushpa 2 Release) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్(Sandhya Theatre Stampede) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నేడు గురువారంతో ఏడాది (Year Anniversary)పూర్తయ్యింది. తొక్కిసలాట దుర్ఘటనలో తన కళ్ల ముందే తల్లిని కోల్పోయిన పదేళ్ల శ్రీతేజ్(Sritej)  తాను తీవ్ర గాయాలపాలై నేటికి మంచం మీద నుంచి కదల్లేకపోతున్నాడు. తొక్కిసలాటకు హీరో అల్లు అర్జున్ రాక కారణమని తేల్చిన పోలీసులు కేసు నమోదు చేసి.. ఒక రోజు చంచల్ గూడ జైల్లో పెట్టారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తల్లిని కోల్పోయి..ఆసుపత్రి పాలైన శ్రీతేజ్ పేరుపై రూ.2 కోట్లు డిపాజిట్ చేశాడు. బాలుడి చికిత్స బాధ్యత తనదేనని ప్రకటించాడు. అనంతర కాలంలో అల్లు అర్జున్ తన సినిమాల్లో బిజీగా మారిపోయారు.

మంచంపైన నిశ్చేష్టంగా శ్రీతేజ్

తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ ఆసుపత్రిలో చావుతో పోరాడి 5 నెలల క్రితం డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం సొంతంగా ఆహారం తినలేక, మాట్లాడలేక, నేరుగా ఊపిరి సైతం తీసుకోలేక ప్రతిదానికి కృత్రిమ ట్యూబ్ లపైనే ఆధారపడి కదల్లేని స్థితిలో ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటలో శ్రీతేజ్ మెదడులోని కణాలు 70శాతం దెబ్బతినడంతో అతను మాట్లాడలేని..కదలలేని నేపథ్యంలో తండ్రి భాస్కర్ తన ఉద్యోగాన్ని సైతం వదిలి కొడుకు వద్దనే ఉంటూ నిత్యం సపర్యలు చేస్తూ..అతనికి చికిత్స చేయిస్తున్నాడు. శ్రీతేజ్ చికిత్సకు నెలకు రూ.1.25లక్షల మేరకు ఖర్చు అవుతుందని వాపోతున్నాడు. హీరో అల్లు అర్జున్ శ్రీతేజ్ పేరుపై చేసిన డిపాజిట్ డబ్బులకు నెలనెల వస్తున్న వడ్డీతో చికిత్స అందిస్తున్నప్పటికి..పలు రకాల థెరపీలు, మందులు, డైపర్లు, ఆహారం ఇతర ఖర్చులన్ని కలిపి నెలకు రూ.1.25లక్షల వరకు ఖర్చవుతుందని కన్నీటి పర్యంతమవుతున్నాడు. శ్రీతేజ చికిత్స ఖర్చు బాధ్యత తనదే అని చెప్పిన హీరో అల్లు అర్జున్ కుటుంబం ప్రస్తుతం దీనిపై స్పందించడం లేదని వాపోయాడు.