విధాత : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ దఫా కేంద్రం ఐదుగురు ప్రముఖులకు భారత రత్న ప్రధానం చేసింది. వారిలో ఎల్కే అద్వానీతో పాటు మరణాంతరం భారత రత్నకు ఎంపికన భారత మాజీ ప్రధాని పీ.వి.నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్లు ఉన్నారు.