• Telugu News
  • /News

UP Dihuli Dalit Massacre: 44 ఏళ్ల తర్వాత.. దిహులి ఊచకోత దోషులకు ఉరిశిక్ష

Reported by: sr | వార్త‌లు | Mar 18, 2025, 6:36 pm IST
Read Time: 4 mins
UP Dihuli Dalit Massacre: 44 ఏళ్ల తర్వాత.. దిహులి ఊచకోత దోషులకు ఉరిశిక్ష

UP Dihuli Dalit Massacre:

విధాత: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిహులి నరమేధం ఘటన కేసులో మెయిన్ పురి కోర్టు ముగ్గురికి ఉరి శిక్ష విధించింది. యూపీలోని ఫిరోజాబాద్ జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిహులి గ్రామంలో 1981 నవంబర్ 18న సాయుధ దుండగుల మూక ఎస్సీ కాలనీపై విరుచకుపడి సామూహిక హింసాకాండకు పాల్పడ్డారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 24మంది మరణించారు. ఈ ఘటన “దిహులి ఊచకోత”గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ హింసాకాండ జరిగిన 44 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. దోషులుగా తేలిన ముగ్గురికి కోర్టు “మరణశిక్ష” విధించింది. దోషుల్లో ఒకరు పరారీలో ఉన్నారు.

మంగళవారం, దోషులు కెప్టెన్ సింగ్, రాంసేవక్ లు కోర్టు ముందు హాజరయ్యారు. మూడవ దోషి రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులందరిలో ముగ్గురు మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నారు. ఈ హత్యాకాండపై స్థానిక నివాసి లాయక్ సింగ్ 1981 నవంబర్ 18న చేసిన ఫిర్యాదుగో జస్రానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాధేశ్యామ్ అలియాస్ రాధే, సంతోష్ చౌహాన్ అలియాస్ సంతోష్, రాంసేవక్, రవీంద్ర సింగ్, రాంపాల్ సింగ్, వేద్రామ్ సింగ్, మిట్టు, భూప్రమ్, మాణిక్ చంద్ర, లాటూరి, రామ్ సింగ్, చున్నిలాల్, హోరిలాల్, సోన్ పాల్, లాయక్ సింగ్, బన్వారీ, జగదీష్, రేవతి దేవి, పూల్ దేవి, కెప్టెన్ సింగ్, కమ్రుద్దీన్, శ్యాంవీర్, కున్వర్ పాల్, లక్ష్మిలతో సహా 20 మందికి పైగా వ్యక్తులపై అభియోగాలు మోపారు.

జిల్లా కోర్టులో ప్రాథమిక విచారణల తర్వాత, కేసును ప్రయాగ్ రాజ్ కు బదిలీ చేశారు. అక్కడి నుంచి కేసును మళ్లీ మెయిన్ పురి స్పెషల్ జడ్జి రాబరీ కోర్టుకు బదిలీ చేశారు. ఇక్కడ కేసు గత 15 సంవత్సరాలుగా విచారణలో ఉంది. మార్చి 11న మెయిన్ పురిలోని రాబరీ కోర్టు న్యాయమూర్తి ఇందిరా సింగ్ నిందితుల్లో ముగ్గురిని సామూహిక హత్యల దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు కోర్టు ముందు హాజరైన కెప్టెన్ సింగ్, రాంసేవక్ తాము నిర్దోషులమని వాదించారు. ఈ రోజు తుది తీర్పులో, పరారీలో ఉన్న మూడో దోషి రాంపాల్ తో సహా ముగ్గురికి కోర్టు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబాలకు 44ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది.