Miss World 2025: IPL మ్యాచ్ కు ప్రపంచ సుందరీమణులు! షెడ్యూల్ ఇదే!

  • By: sr    news    May 04, 2025 6:40 PM IST
Miss World 2025: IPL మ్యాచ్ కు ప్రపంచ సుందరీమణులు! షెడ్యూల్ ఇదే!
  • ప్రపంచ సుందరీమణుల షెడ్యూల్ ఖరారు
  • మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ
  • ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కంటెస్టెంట్లు
  • ఈ నెల‌12న హైద‌రాబాద్‌లో హెరిటేజ్ వాక్‌

హైదరాబాద్ (విధాత): మిస్ వరల్డ్ పోటీలను ఉప‌యోగించుకొని తెలంగాణ‌లో విదేశీ ప‌ర్య‌ట‌కుల‌ను ఆక‌ర్షంచేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే తెలంగాణ తొలి టూరిజం పాల‌సీని రూపొందించింది. అద్భుత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన తెలంగాణను దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడం, పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందుకోసం ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను సరైన వేదికగా ఉపయోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రాబాద్‌లో జ‌రిగే ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌కు 120 దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. అలాగే 150కి పైగా దేశాల్లో ఈ ఈవెంట్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్న‌ది. తెలంగాణలో జ‌రిగే ఈ పోటీల ద్వారా ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌చారం క‌ల్పించి తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించింది.

గ‌త ఏడాది తెలంగాణ‌కు. 1.55 ల‌క్ష‌ల విదేశీ ప‌ర్యాట‌కులు

2024 సంవత్సరంలో తెలంగాణను 1,55,113 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. ఈ సంఖ్య గణనీయంగా పెరిగేందుకు స‌ర్కారు ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌ను ఉప‌యోగించుకుంటోంది. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా హైదరాబాద్, వరంగల్ వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి , రామప్ప, నాగార్జున సాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు సందర్శించనున్నారు.

ఈ నెల 12 న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పేలా చార్మినార్, లాడ్ బజార్‌లలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు “హెరిటేజ్ వాక్” నిర్వహిస్తారు. ఈ నెల 13 న హైదరాబాద్‌కే తలమానికంగా నిలుస్తున్న చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించి ఓల్డ్ సిటీ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియ చేస్తారు. ఈ నెల 14న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్‌లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్‌ను సందర్శిస్తారు. అదే రోజు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. కాకతీయులు యుద్ధ రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరిణి నృత్యాన్ని రామప్పలో తిలకిస్తారు.

ఈ నెల15 న మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్‌పీరియన్సల్ పర్యటనలో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీ, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఈ నెల 16 న మెడికల్ టూరిజం పరిచయ కార్యక్రమంలో భాగంగా మెడికల్ టూరిజం చేపడతారు. మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి వృక్షాన్ని , హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్‌పీరియం పార్కును సందర్శిస్తారు.

ఈ నెల 17న ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు సందర్శిస్తారు. 18 న మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను , ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్స్ ను పరిశీలిస్తారు. ఇదే రోజు సాయంత్రం మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే _ ఫండే కార్నివాల్ ను సందర్శిస్తారు.

ఈ నెల 20 లేదా 21న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు కంటెస్టెంట్లు హాజరవుతారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులు నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యత ను ప్రపంచానికి తెలుపడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక “మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్”గా నిలిపే అవకాశం లభిస్తుందని ప్ర‌భుత్వం భావిస్తోంది.