- చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే
- రెవెన్యూ సంఘాల నేతలతో సీఎం రేవంత్రెడ్డి
- సీఎం చేతుల మీదుగా టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డైరీల ఆవిష్కరణ
- తహశీల్దార్ల బదిలీలు చేయాలని వినతి
విధాత: కొత్త ఆర్వోఆర్ చట్టంగా భూభారతి (Bhu Bharathi) త్వరలోనే అమల్లోకి రానుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. భూభారతి రాకతో రాష్ట్రంలోని రైతులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త చట్టంతోనే భూ సమస్యలకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) నూతన సంవత్సర డైరీలను ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డితో సీఎం రేవంత్రెడ్డి కొత్త ఆర్వోఆర్ చట్టం, దానిలోని ప్రధాన అంశాల గురించి చర్చించారు. ధరణితో రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగంగా, సులభంగా అందించే లక్ష్యంతోనే భూభారతిని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. జిల్లా స్థాయిలోనే అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం లభించే విధంగా కొత్త చట్టంలో ఉందన్నారు. ఇదే కాకుండా రెవెన్యూ అధికారులకు సైతం వివిధ స్థాయిల్లో అధికారాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా సమర్ధవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల మీదనే ఉందన్నారు. భూభారతిలో కల్పించిన అధికారాల వికేంద్రీకరణతో క్షేత్ర స్థాయిలోనే రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇదే కాకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలోనూ ఒక రెవెన్యూ అధికారి ఉండేలా కూడా చూస్తున్నట్టుగా చెప్పారు.
తహశీల్దార్ల బదిలీలను చేపట్టండి:వి.లచ్చిరెడ్డి
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తహశీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారని ఈ సందర్భంగా వి.లచ్చిరెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లను నేటి వరకు కూడా సొంత జిల్లాలకు బదిలీ చేయలేదన్నారు. దీంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం సాధ్యమైనంత త్వరలోనే బదిలీల ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టనున్నట్టుగా చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్సింగ్ చౌహాన్, శ్రీనివాసులు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మహిళా అధ్యక్షురాలు సుజాతచౌహాన్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.