తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు, కేంద్ర గిరిజన యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాని ప్రకటించిన ఇవి కొత్తవేమీ కాదు. కేంద్ర గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలో ఉన్నదే. తొమ్మిదిన్నరేళ్లుగా ఆ హామీని అమలు చేయలేదు. పసుపు బోర్డు ఏర్పాటు అన్నది గత లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ల పార్టీ ఎంపీ అక్కడి పసుపు రైతులకు హామీ ఇచ్చారు.
వాళ్లకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా చట్టసభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. పసుపు బోర్డు పెట్టాలని కోరాయి. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పసుపుబోర్డు ప్రకటించారనే విమర్శలు ఉన్నాయి.
పసుపు బోర్డు ప్రకటనతోనే ఒనగూరేది ఏమీ లేదు. దాని విధివిధానాలకు సంబంధించి జీవో వెంటనే విడుదల చేయాలి. నిధులను విడుదల చేయాలి. స్థల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. నేషనల్ టర్మరిక్ బోర్డుతో చర్చలు జరిపి వాళ్ల అంగీకారంతోనే ప్రధాని పసుపు బోర్డు ప్రకటన చేశారా? లేక ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత బోర్డు ఒప్పుకోవడం లేదని గతంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో సాంకేతిక సమస్యలను సాకుగా చూపెట్టి సాధ్యం కాదంటారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అదే స్థాయిలో మరో సమస్య మిరప సాగు. దానికి కూడా పసుపు రైతుల కష్టాలు తీర్చినట్టే మిరప రైతుల సమస్యలు తీర్చాలి. మిర్చి సాగు, ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో మొదటి ఐదో స్థానాల్లోపే ఉన్నాయి. ఇక్కడ ఉత్పాదక ఎక్కువగానే ఉన్నది. కాకపోతే ధర హెచ్చుతగ్గుదలతో రైతులు వెనకంజ వేసే అవకాశం ఉన్నది. అదే బోర్డు ఏర్పాటు చేస్తే సీజన్కు ముందే ధర నిర్ణయమౌతుంది. దీంతో రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలన్నదని ఒక ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు.
బోర్డు ఏర్పాటునకు అవకాశం ఉన్నమరో పంట ఉల్లి. ఉమ్మడి వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానకాలం, యాసంగిలో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు దేశ అవసరాలు తీర్చే అవసరాలు తీర్చే అవకాశం ఉన్నది. ఈ పంటను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఏర్పాటు చేయాలి. సోయా పంట నిజామాబాద్, ఆదిలాబాద్లలో ఎక్కువగా పండుతుంది. ఈ జిల్లాల్లోని నేలలు ఈ పంటకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ పంట తెలంగాణతో పాటు యూపీలోనూ పండుతుంది. కానీ మన రాష్ట్రంలో పండే పంటే నాణ్యత ఉంటుంది.
ఇలా అనేక పంటలు పండుతున్నాయి. మీరు ఇచ్చిన హామీ ఒక్కటే కాకుండా రాష్ట్ర రైతులందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ పంటలను దృష్టిలో పెట్టుకుని బోనస్ ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. అలాగే తెలంగాణ విత్తన భాండాగారం. దాదాపు 60 శాతానికి పైగా దేశ విత్తన అవసరాలు తీర్చుస్తున్నది తెలంగాణ రాష్ట్రమే. ప్రపంచానికి విత్తన పాఠాలు నేర్పిన అంకాపూర్ కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి ప్రధాని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం కాకుండా హరిత విప్లవ పితామహులు ఎంఎస్ స్వామినాథన్ సూచించినట్లు సతత హరిత విప్లవం ఆవిష్కరణలకు బాటలు వేయండి.