రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన ఐపిఎల్ మ్యాచ్లో జడేజా ఫీల్డింగ్కు అంతరాయం కలిగించినందుకు అవుటయ్యాడు. దీంతో జడేజా తీవ్ర అసహనానికి గురయ్యాడు.
ఐపిఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్ (RR vs CSK)లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించిన విషయం విదితమే. అయితే చెన్నై బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ రుతురాజ్తో సమన్వయలోపం వల్ల “ ఫీల్డింగ్కు అంతరాయం(Obstructing the Field)” కలిగించినందుకు అవుటయ్యాడు. ఐపిఎల్ చరిత్రలో ఈ విధంగా ఔటవడం ఇది మూడవసారి. ఇంతకుముందు యూసుఫ్ పఠాన్(2013) , అమిత్ మిశ్రా(2019) ఈ రీతిలో అవుటయ్యారు. దీంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలయింది. జడేజాను థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం సబబేనా అనేది చర్చ.
అసలు జరిగిందేంటంటే, ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో జడేజా థర్డ్మ్యాన్ దిశగా బాల్ను తరలించి ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు మొదలుపెట్టాడు. కానీ, అటువైపు చేరుకున్న రుతురాజ్ గైక్వాడ్ రెండో పరుగు నిరాకరించాడు. దాంతో అప్పటికే సగం దూరం దాటి వచ్చిన జడేజా వెనుదిరిగాడు. అదే సమయంలో బాల్ను అందుకున్న కీపర్ కెప్టెన్ సంజూశాంసన్(Sanju Samson) వేగంగా బాల్ను నాన్ స్ట్రయికర్ వికెట్ల వైపు విసిరాడు. ఆ క్రమంలో పరుగు తీస్తున్న జడేజా పరుగు దిశను మార్చుకుని బాల్ దారిలోకి వచ్చేసాడు. అది విసురుగా జడేజా వీపుకి తాకి, పక్కకి వెళ్లిపోయింది. దాంతో అసహనానికి గురైన సంజూ, అంపైర్కు అప్పీల్ చేసాడు. ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్కు నివేదించగా, థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి దాన్ని ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా పరిగణించి అవుట్ ఇచ్చాడు.
క్రికెట్లో నిబంధనలను రూపొందించే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్ 37.1 ప్రకారం, ‘ఎవరైనా బ్యాటర్, బంతి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ను మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ అడ్డుకుంటే దాన్ని అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్గా పరిగణించవచ్చు.’
చెన్నై సూపర్కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ(Michael Hussy) మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఎలాగైనా ఉండిఉండవచ్చు. జడేజా వెనుదిరిగినప్పుడు తను పరుగు తీస్తున్న కోణం కొంత మారివుండవచ్చు. అయితే బ్యాటర్ తన పరుగు లైన్ను మార్చుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి కాబట్టి, అంపైర్ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. దాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్. అన్నాడు. అలాగే, రాజస్థాన్ క్రికెట్ డైరెక్టర్ సంగక్కర (Kumara Sangakkara) మాట్లాడుతూ, అంపైర్ నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేసాడు. క్రికెట్ చట్టాల ప్రకారం, బ్యాటర్ బంతి పయనిస్తున్న దారిలోకి రాకూడదు. ఈమధ్య రూల్స్ మారాయి. బ్యాటర్ పిచ్ మధ్యలో పరుగెడుతున్నాకూడా బంతి బ్యాటర్కు తగిలితే దాన్ని అవుట్గానే పరిగణిస్తున్నారు. నిజానికి జడేజా అదే పక్కనుండి పరిగెట్టిఉంటే సమస్య ఉండేది కాదు. అని తెలిపాడు.
ఏదేమైనా మ్యాచ్ను చెన్నై గెలిచింది కాబట్టి, ఈ విషయం గురించి చెన్నై అంతగా పట్టించుకోలేదు. ఒకవేళ ఓడిపోయివుంటే , ఈ చర్చ మరింత రసవత్తరంగా ఉండేది.