HCA | హెచ్సీఏ పై చర్యలకు విజిలెన్స్ సిఫారసులు!

HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. హెచ్సీఏ పై చర్యలకు విజిలెన్స్ సిఫారసులు చేసినట్లుగా సమాచారం. హెచ్ సీఏ సెక్రటరీ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లుగా విచారణలో తేలింది. పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నుంచి మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్ సీఏ సెక్రటరీ ఒత్తిడి తెచ్చారని…అయితే అదనంగా మరో 10శాతం ఫ్రీ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తేల్చేయడంతో వివాదం ముదిరిందని నివేదికలో పేర్కొన్నారు.
సెక్రటరీ జగన్మోహన్ టికెట్లను ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారని..హెచ్ సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే ఎస్ఆర్హెచ్ టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని, అయితే తనకు వ్యక్తిగతంగా 10శాతం టికెట్లు కావాలని డిమాండ్ చేశాడని నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ ఆర్ హెచ్ తేల్చి చెప్పడంతో మ్యాచ్ ల సందర్భంగా జగన్మోహన్ వారిని ఇబ్బందులకు గురిచేశాడని..లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బందితో తాళాలు వేయించాడని నివేదికలో పేర్కొన్నారు. ఎస్ఆర్హెచ్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ కావడంతో హెచ్సీఏ పై చర్యలకు ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ సిఫారసులు చేసినట్లుగా సమాచారం.