Site icon vidhaatha

Harmanpreet Kaur | టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌పై వేటు తప్పదా..?

Harmanpreet Kaur | టీమిండియా మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో పాటు జట్టు ఆటతీరుతో విమర్శలను ఎదుర్కొంటున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో ఓడిన భారత జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను కెప్టెన్సీలో కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీపై త్వరలోనే బీసీసీఐ నిర్ణయం తీసుకునున్నట్లు తెలుస్తున్నది. జట్టుకు కొత్త కెప్టెన్‌ అవసరమా? లేదా? అన్నదానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించేందుకు హెడ్‌కోచ్‌ అమోల్‌ మజుందార్‌తో సెలక్షన్‌ కమిటీ సమావేశం అవుతుందని పేర్కొంది. ఈ సందర్భంలోనే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్నీపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీసీఐ జట్టు కోరుకున్న ప్రతీదాన్ని అందించడంతో పాటు కొత్తవారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని.. అందుకు ఇదే సరైన సమయమని బీసీసీఐ భావిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంది.

హర్మన్‌ప్రీత్ జట్టులో కీలకమైన సభ్యురాలిగా కొనసాగుతుందని తెలిపాయి. ఇంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో జట్టు నిరాశజనకమైన ప్రదర్శన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా భవిష్యత్‌పై మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ అభిప్రాయం చెప్పింది. బీసీసీఐ, సెలెక్టర్లు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని.. ప్రపంచకప్‌కు మరో రెండేళ్లు ఉందని.. మార్పులకు ఇదే సరైన సమయమని చెప్పింది. ఇప్పడు కెప్టెన్సీని మార్చకపోతే మళ్లీ మార్చొద్దని.. ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడిన సమయంలో కెప్టెన్‌ని మార్చడం సరికాదని చెప్పారు. స్మృతి ఖచ్చితంగా జట్టులో ఉంటుందని.. ఆమెకు కెప్టెన్సీ ఇచ్చేందుకు సెలెక్టర్లు ఆసక్తి చూపించవచ్చని చెప్పింది. వ్యక్తిగతంగా అయితే జెమీమాలాంటి క్రీడాకారిణి కెప్టెన్‌గా ఉండాలని తాను భావిస్తానని మిథాలీ చెప్పింది. జెమీమా అందరితో మాట్లాడుతుందని.. ఈ టోర్నీలో జెమీమా ప్రదర్శనతో ఇంప్రెస్‌ అయ్యాయని చెప్పింది.

Exit mobile version