కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో నాలుగోవంతుతో ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తయి ఉండేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
విధాత: కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో నాలుగోవంతుతోనే ప్రాణహితచేవెళ్ల ఎత్తిపోతల పూర్తయి, కొత్తగా 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది ఉండేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కానీ.. అంబేద్కర్ ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. 2024 డిసెంబర్ నాటికి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శనివారం జలసౌధలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఉన్నఅడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో తెలంగాణ ప్రజలు తరతరాలుగా దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని తెలిపారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశామని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతున్నామని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి నిధుల కోసం ఈ వారంలో ప్రతిపాదనలు
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతతో ఉందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రితో కలిసి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినా, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి హామీ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని తెలిపారు. నీటిపారుదల శాఖలో బీఆరెస్ పాలకులు అప్పులు ఎక్కువ చేశారని, అందుకు తగిన ఫలితం మాత్రం రాలేదన్నారు. బీఆరెఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున జరిగిన నిధుల వృథా, అనుత్పాదక వ్యయాన్నిబహిర్గతం చేశామన్నారు. తమ ప్రభుత్వం కొత్త ఆయకట్టును పెంచడంపై దృష్టి సారించిందన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గానికి నీరందించే పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.
కొత్త ఆయకట్టు సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు
రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కొత్త ఆయకట్టుకు నీరిచ్చే విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివరినాటికి నీరందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
వేసవిలో చెరువుల పూడిక
రాబోయే వేసవికాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే జరగాలన్నారు. రైతుల పంటలకు చెరువుల నీరు పెట్టడం ఆగిపోవడంతోనే పనులు మొదలు కావాలన్నారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి, వర్షాకాలంలోపు పూర్తి చేయాలన్నారు. ఐడీసీ పరిధి ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
కోయినా నుంచి వంద టీఎంసీల నీరు ఇవ్వండి
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు వేసవిలో తాగునీటి అవసరాల కోసం కోయినా ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీరు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. అలాగే కర్ణాటక నుంచి కూడా 10 టీఎంసీల నీటిని కోరుతున్నామన్నారు. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనుందని ఆయన వివరించారు. నీటికి బదులుగా మహారాష్ట్రకు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన వ్యయం అందిస్తామని ప్రతిపాదించామని తెలిపారు. ఈ సమావేశంలో నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్రావుతోపాటు పలువురు చీఫ్ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.