ధరణి పెట్టిన చిచ్చు .. తహశీల్థార్‌ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

ధరణిలో తన భూరికార్డులు మాయం కావడంతో ఆందోళనకు గురైన ఓ రైతు తహశీల్ధార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు

Reported by: Subbu | తెలంగాణ‌ | Jun 26, 2024, 4:06 pm IST
Read Time: 3 mins
ధరణి పెట్టిన చిచ్చు .. తహశీల్థార్‌ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

విధాత : ధరణిలో తన భూరికార్డులు మాయం కావడంతో ఆందోళనకు గురైన ఓ రైతు తహశీల్ధార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామానికి చెందిన చెన్నెకేశ లక్ష్మయ్య, కమలమ్మ దంపతులకు ఘాన్సిమియగూడ పరిధిలోని సర్వే నంబర్ 4/7, 4/8 లో ఎనిమిది ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమిని చెన్నెకేశ లక్ష్మయ్య తాత ముత్తాతలు 1977 లో కొనుగోలు చేశారు. ధరణి వచ్చిన మొదట్లో తన భూమి ఆన్ లైన్ లో ఉందని గత ఏడాది నవంబర్ నుంచి ధరణిలో తమ ఎనిమిది ఎకరాల భూమి లేదని, శంషాబాద్ తహశీల్దార్ నాగమణి కావాలనే తమ పట్టా భూమిని ధరణి నుంచి తొలగించి వేరే వాళ్ళకి పట్టా చేసిందని బాధిత రైతు లక్ష్మయ్య వాపోయాడు. ఇదే సమస్యపై ఏడాది కాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నాగమణి పట్టించుకోవడం లేదని లక్ష్మయ్య ఈరోజు ఆత్మహత్య చేసుకొబోయాడు. పక్కనే ఉన్న వారు సమయానికి అతని ఒంటిపై నీరు పోయడంతో ప్రాణాలు దక్కాయి. ఈ వివాదంపై స్పందించిన తహశీల్ధార్ నాగలక్ష్మి మాట్లాడుతూ లక్ష్మయ్య భూమిని తాను ధరణి నుంచి తొలగించలేదని, తనకు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని, ధరణిలో భూమి లేదని చెబితే లక్ష్మయ్య నుంచి అప్లికేషన్ తీసుకొని దాని ప్రక్రియ కొనసాగిస్తున్నామని నాగమణి చెబుతున్నారు.