విధాత : సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ధరణి మాటున సాగిన 2లక్షల కోట్ల భూ స్కామ్పై రహస్య విచారణ జరిపిస్తు కేసీఆర్, కేటీఆర్లతో 40శాతం వాటలు అడుగుతున్నట్లుగా ప్రచారం వినిపిస్తుందని, భూ స్కామ్పై రేవంత్రెడ్డికి ఎంత మాత్రం చిత్తశుద్ధితో ఉన్న దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలంలో మీడియాతో మాట్లాడారు.
2లక్షల కోట్ల ధరణి భూకుంభ కోణాన్ని రేవంత్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పచెప్పడం లేదని ప్రశ్నించారు. రహస్య కమిటీ వేసి విచారణ సమాచారాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. వేలకోట్ల వ్యవహారాలతో ఉండే భూముల కేసులను తొక్కిపెడుతు ఫోన్ ట్యాపింగ్ వంటి ఇతర అంశాలను రేవంత్ ప్రభుత్వం పథకం ప్రకారం తెరపైకి తెస్తున్నారన్నారు. 2లక్షల కోట్ల కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలన్నారు.