Site icon vidhaatha

మైన్స్‌, మినరల్స్‌ 2105సవరణ బిల్లుకు బీఆరెస్‌ మద్ధతు అవాస్తవం : మాజీ ఎంపీ వినోద్‌

విధాత, హైదరాబాద్‌ : మైన్స్, మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంటులో బీఆరెస్‌ మద్దతు ఇచ్చిందన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపణలను బీఆరెస్‌ మాజీ ఎంపీ జి.వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో బిల్లు వివరాలను వెల్లడిస్తూ భట్టి చేసిన ఆరోపణలను ఖండించారు. మైన్స్‌ మినరల్స్‌ సవరణ బిల్లును భట్టి ఒకసారి పూర్తిగా చదవాలని డిమాండ్‌ చేశారు. ఆ బిల్లును మొదట 2011లో మన్మోహన్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, యూపీఏలో స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు తెచ్చిన బిల్లునే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిందన్నారు. బీఆరెస్‌ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారనడం అర్థరహితమన్నారు. వాయిస్ ఓటుతో మినరల్ బిల్లు పాస్ అయిందనే కనీస పరిజ్ఞానం కాంగ్రెస్‌కు లేకపోవడం దురదృష్టకరమన్నారు. భట్టి బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రేవంత్, మోదీతో కలిసి సింగరేణిని అమ్ముతారని ఎపుడో చెప్పామని, . అదే నిజం అవుతోందన్నారు. బీఆరెస్‌, బీజేపీలు బిల్లుకు మద్దతు ఇవ్వలేదని, కాంగ్రెస్సే ఆ బిల్లు తెచ్చిందని వినోద్‌ తెలిపారు. సింగరేణికి బొగ్గు గనుల కోసం బిల్లులోని సెక్షన్ 17 ఏ కింద బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి రిజర్వ్ చేయవచ్చని వెల్లడించారు. గతంలో సీఎం కేసీఆర్ సింగరేణిపై కేంద్రానికి రాసిన లేఖనే ఇపుడు రేవంత్ ప్రామాణికముగా తీసుకోవాలన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తక్షణమే ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి సింగరేణిని బతికించాల్సిన అవసరముందన్నారు. వందేళ్లకు సరిపడా సింగరేణిలో బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించాలని బీఆరెస్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. సింగరేణిని చంపడానికే బీజేపీకి ఎనిమిది ఎంపీలు గెలిపించరా అని నిలదీశారు. వెంటనే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని, మోదీతో ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సింగరేణి బ్లాక్‌ల వేలాన్ని వాయిదా వేశారే తప్ప సింగరేణికి కేటాయింపజేయలేకపోయామన్నారు.

Exit mobile version