తెలంగాణ జేఏసీ చైర్మన్గా వ్యవహరించిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను బీఆరెస్ టార్గెట్ చేయడంపై తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
Kodandaram | విధాత : తెలంగాణ జేఏసీ చైర్మన్గా వ్యవహరించిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను బీఆరెస్ టార్గెట్ చేయడంపై తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయగా.. బీఆరెస్ నేతలు కోర్టులో దాఖలు చేసిన కేసుతో ఆయన పదవీ ప్రమాణ కార్యక్రమం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. గవర్నర్తో గతంలో నెలకొన్న వివాదానికి ముడిపెట్టి బీఆరెస్ అడ్డం పడిన తీరు ఉద్యమకారుల్లో అసంతృప్తిని రగిలిస్తున్నది.
జేఏసీ చైర్మన్గా విభిన్న వైఖరులతో ఉండే రాజకీయ పార్టీలను ఒక వేదికపైకి తెచ్చి, సాగర హారం, మిలీనియం మార్చ్, సకల జనుల సమ్మె వంటి వాటితో తెలంగాణ ఉద్యమాన్ని లక్ష్యం దిశగా తీసుకెళ్లడంలో కీలక భూమికను కోదండరాం పోషించారు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆరెస్కు ఎందుకు అంత వ్యతిరేకతని ఉద్యమకారులు నిలదీస్తున్నారు. బీఆరెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అయిన వాళ్లు కోదండరాం కంటే గొప్పవాళ్లు, రాజకీయాలతో సంబంధం లేనివారన్నట్టుగా బీఆరెస్ వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. కోదండరాం ఒక్కరికే రాజకీయాలతో సంబంధమున్నట్టు, ఆయన నియామకమే తప్పన్నట్లుగా వాదించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
బీఆరెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపికైన వారిలో నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్, రాములు నాయక్, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ గుప్తా ఉన్నారు. వారిలో ఒక్క కోదండరాం మాత్రమే రాజకీయ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు అని ఎందుకు బొంకుతున్నరంటూ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో కోదండరాంను ఉద్దేశించి ‘సర్పంచ్ కూడా కాలేనోడు’ అంటూ కేసీఆర్ హేళన చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాంను పెద్దల సభకు గౌరవంగా పంపుతున్నారని, అది జీర్ణించుకోలేక బీఆరెస్ అడ్డం పడుతున్నదంటూ మండిపడుతున్నారు.