'మొన్న జరిగిన ఎన్నికలు... డిసెంబర్ ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే, ఆ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావును చిత్తుగా ఓడించారు... ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బిజెపి నేతలు సూరత్ పారిపోయేలా'తీర్పు
విధాత బ్యూరో, కరీంనగర్: ‘మొన్న జరిగిన ఎన్నికలు… డిసెంబర్ ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే, ఆ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావును చిత్తుగా ఓడించారు… ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బిజెపి నేతలు సూరత్ పారిపోయేలా’తీర్పు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో జన జాతర పేరిట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ తెలంగాణకు ఇచ్చింది, ఐదేళ్లు లోకసభ సభ్యుడిగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ కు తెచ్చింది ఏమీ లేదన్నారు. ‘మొన్నటి ఎన్నికల్లో కారు ఖరాబై ఖార్కానాకు పోయింది.. ఇక దానిని జుమ్మెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే’అన్నారు. తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయింది అన్నట్లు ఉందని కెసిఆర్ చేపట్టిన బస్సు యాత్రను ఉద్దేశించి వ్యంగోక్తి విసిరారు. దేశంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 70 ఏళ్లుగా వారు అనుభవిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమన్నారు. దేశంలోని మూలవాసులకు ఆధారంగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చారంటూ ఆయన బిజెపిని నిలదీశారు.
అవహేళన చేసినందుకా…
పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లు ఆమోదించారు… తల్లిని చంపి, బిడ్డను బతికించారు అంటూ రెండు లోకసభలో ప్రధాని తెలంగాణ ఏర్పాటును అవమానించారని చెప్పారు.
ఏళ్ల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన అవహేళన చేశారన్నారు. అదే సభలో ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రధాని తప్పు పట్టిన నాడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తెలంగాణను అవహేళన చేసినందుకు ప్రజలు ఈ ఎన్నికల్లో మీకు ఓట్లు వేయాలా అంటూ నిలదీశారు. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, ఐఐఎం, ఐఐటి హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. నిజామాబాద్ గుండు, కరీంనగర్ అరగుండు తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదన్నారు. తమ పదేళ్ల పాలనలో ఆంధ్రకు చెంబు, మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు మాత్రమే మోడీ ఇవ్వగలిగారని ఎద్దేవా చేశారు.
మేము హిందువులమే…
అయోధ్యలో రామ మందిరం పూర్తి కావడానికి 15 రోజుల ముందే బిజెపి నేతలు కళ్యాణం అక్షింతలు ఊరూరా పంచారని, తద్వారా హిందూ సంప్రదాయాన్ని అవమానించారని అన్నారు.
హిందువులు ఈ విషయమై ఆలోచన చేయాలన్నారు. అందరం రాముని భక్తులమే.. శ్రీరామ కళ్యాణం.. హనుమాన్ జయంతి మనం జరపడం లేదా? గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడం లేదా? అయితే దానిని హిందుత్వ ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నామా? అని ప్రశ్నించారు. దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. అయితే దేవుడి పేరుతో ఓట్లు అడుక్కొనే దిక్కుమాలిన పరిస్థితి దేశంలో ఉందన్నారు.
వారి మధ్య చీకటి ఒప్పందం…
దేశంలో హంగ్ వస్తుందని, రాష్ట్రంలో తమకు కనీసం 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతామని కెసిఆర్ అంటున్నారు.. మరి వాళ్లు పొత్తు పెట్టుకునేది ఎవరితో.. అని ప్రశ్నించారు. కెసిఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వడం అంటూ జరగదని, కెసిఆర్ ఇంటి మీద వాలిన కాకి తమ ఇంటి గోడ మీద కూడా వాలడానికి వీలు లేదని అన్నారు. బిజెపి, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.
వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు పోటీ చేస్తూ కాంగ్రెస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలను చూసిన అనంతరం సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి తమకు మద్దతుగా నిలిచాయని
చెప్పారు.
రామప్ప సాక్షిగా…
కాంగ్రెస్ కార్యకర్తలు భుజాలు కాయలు కాసి, తమ చమటను రక్తంగా మార్చి ఈ ప్రభుత్వాన్ని తెచ్చారు.. వారి శ్రమకు తగ్గ ఫలితంగా వంద రోజుల్లో బ్రహ్మాండమైన పథకాలు తెచ్చి
ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నామని అన్నారు. మీకు మా ప్రభుత్వం రుణపడి ఉంది.. అందుకే రామప్ప శివుని సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి లాభం లేదన్నారు. ఈ విషయం రైతులకు చెప్పాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.