విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేడు మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. 6వ తేదీన మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మార్చ్ 7వ తేదీన వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈనెల 8న ఓల్డ్ సిటీలో రెండో దశ మెట్రో పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, మార్చ్ 9వ తేదీన ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈనెల 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈనెల 12న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.