CM Revanth Reddy| తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవాడని.. ఆయ‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ప‌క్క‌న‌పెట్టారంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇష్ఠారాజ్యంగా పాలన చేసే వారు ఎవరైనా ట్రంప్ లాంటి వారేనని..అలాంటి పాలన ఎక్కువ రోజులు ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy| తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణలోనూ(Telangana) ఓ ట్రంప్(Trump), ఉండేవారు అని ..ఇష్ఠారాజ్యంగా పాలన చేసే వారు ఎవరైనా ట్రంప్ లాంటి వారేనని.. అలాంటి పాలన ఎక్కువ రోజులు ఉండదని.. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్ ను పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్(Kcr) ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ(New Delhi) లో ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యాల‌తో అమెరికాకే ఎక్కువ‌గా న‌ష్టం అన్నారు. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండేవాడని.. ఆయ‌న‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ప‌క్క‌న‌పెట్టారంటూ కేసీఆర్ పై సెటైర్లు వేశారు. ట్రంప్ అమెరికాలో వద్దన్న సంస్థలతో మాట్లాడి తెలంగాణకు తీసుకొస్తాం అని..పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ పవర్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాల‌నేది మా ఆలోచ‌న‌ అని..దేశంలో యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం) తెలంగాణ అని, కొత్త రాష్ట్రమైనా తెలంగాణ‌కు, హైద‌రాబాద్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉందన్నారు.

తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్-2047

తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించాం అని రేవంత్ రెడ్డి వివరించారు. 2025, డిసెంబర్ 9 న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుద‌ల చేస్తామన్నారు. తెలంగాణ‌ను కోర్ అర్బ‌న్‌, సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా విభ‌జించాం అని.. కోర్ అర్బ‌న్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నారని.. ఇక్క‌డ కాలుష్య‌కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌గ‌రం వెలుప‌లికి త‌ర‌లిస్తున్నాం అని తెలిపారు. సెమీ అర్బన్ ఏరియాను త‌యారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించాం అని, తెలంగాణ‌లో అభివృద్ధికి త‌గిన‌ట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీట‌ర్లు పొడిగించాల‌ని నిర్ణ‌యించాం అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం అయిదు ల‌క్ష‌ల మంది మెట్రోలో ప‌య‌నిస్తున్నారని..దానిని 15 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.

సబర్మతీ తీరంలా మూసీ సుందరీకరణ

గుజరాత్ సబ‌ర్మ‌తీ తీరంలా మూసీ నదిని సుందరీకరిస్తామని..అందుకు మూసీ పున‌రుజ్జీవంపై దృష్టి సారించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. హైద‌రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేప‌డుతున్నాం. 2027 నాటికి హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలే ఎక్కువ‌గా ఉండ‌నున్నాయి.. అందుకే ఈవీల‌కు రాయితీలు ప్రకటించాం అని తెలిపారు. రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నామని, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాం అన్నారు. విమానాశ్ర‌యం నుంచి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ అనుసంధాన‌త క‌ల్పిస్తాం అని తెలిపారు. తెలంగాణ‌లో సేంద్రియ పంట‌లు పండుతున్నాయన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ స‌మ‌స్య ఉంది.. మేం తెలంగాణ‌లో డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేశాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

పెట్టుబడులకు సురక్షిత కేంద్రం తెలంగాణ

తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం ప‌లుకుతున్నాం…పెట్టుబ‌డిదారుల‌కు అన్ని రకాలుగా మ‌ద్దతుగా నిలుస్తాం.. తెలంగాణ‌లో పెట్టే పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండని పిలుపునిచ్చారు. జ్ఞానంతో పాటు నైపుణ్యం అవ‌స‌రం అన్న కోణంలో యువ‌తలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం అన్నారు. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా స్ఫూర్తిని అనుస‌రిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. స్పోర్ట్స్‌లో ద‌క్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వ‌చ్చే మెడ‌ల్స్ చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుందని, ఒలింపిక్స్ ప‌త‌కాల సాధ‌నే ల‌క్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం అని తెలిపారు. తెలంగాణ‌కు భూప‌రివేష్టిత రాష్ట్రం (ల్యాండ్ ల‌క్డ్‌) కావ‌డంతో ఓడ రేవు లేదు అని, మ‌చిలీప‌ట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచ‌ర్ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామని.. దానికి స‌మాంత‌రంగా రైల్వే లైన్ మంజూరు చేయాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం అని వెల్లడించారు. బ‌ల్క్ డ్ర‌గ్స్ ఉత్ప‌త్తిలో 40 శాతం తెలంగాణ‌నే చేస్తోంది… వ్యాక్సిన్ల త‌యారీలో హైద‌రాబాద్ ముందు వ‌రుస‌లో ఉందని గుర్తు చేశారు.