Congress | కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం.. సిటింగ్ స్థానం కోల్పోయిన బీఆరెస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి వంశ తిలక్పై శ్రీ గణేశ్ 14,285ఓట్లతో గెలుపొందారు

అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం
తగ్గిన బీఆరెస్ ఎమ్మెల్యేలు
విధాత : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి వంశ తిలక్పై శ్రీ గణేశ్ 14,285ఓట్లతో గెలుపొందారు. శ్రీ గణేశ్కు 45,396 ఓట్లు పోలవ్వగా, వంశ తిలక్కు 31,111ఓట్లు, బీఆరెస్ అభ్యర్థి నివేదిత సాయన్నకు 28,863ఓట్లు పోలయ్యాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత బీఆరెస్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్పై విజయం సాధించారు. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సివచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత లాస్య నందిత చెల్లెలు నివేదిత సాయన్నను బరిలోకి దించగా, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేశ్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి నివేదిత మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయినట్లయ్యింది. బీజేపీ వరుసగా ఈ స్థానంలో రెండో స్థానంలోనే నిలవడం విశేషం. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా ఆ పార్టీ బలం అసెంబ్లీలో తన సంఖ్యాబలం 65కు పెంచుకుంది. బీఆరెస్ నుంచి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 67కు పెరిగింది. సీపీఐ ఒక స్థానంతో కలిపితే 68కి చేరుకుంది. బీఆరెస్ బలం 39నుంచి 36కు పడిపోయింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఒక్క సీటు కూడా గెలువకపోవడం, అసెంబ్లీలో సైతం ముగ్గురు ఎమ్మెల్యేలను చేజార్చుకోవడం ఆ పార్టీకి మింగుడుపడనిదిగా మారింది.