రాష్ట్రంలో పత్తి రైతు మెడపై కల్తి విత్తన కత్తి వేలాడుతున్నది. ఏటా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి
కల్తీతో ఆర్థికంగా నష్టం
జోరుగా సాగుతున్న అక్రమ విత్తన దందా
ఏటా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో పత్తి రైతు మెడపై కల్తి విత్తన కత్తి వేలాడుతున్నది. ఏటా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కల్తీ విత్తనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కల్తీ విత్తన దందా యథేచ్ఛగా సాగుతున్నది. చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం, కల్తీ వ్యాపారుల మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్ల రైతును ఆర్థికంగా నష్టపోయి కుంగిపోతున్నాడు. ఫలితంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద సంఘటనలు జరుగుతున్నాయి. ఈ కల్తీని అరికట్టడంలో తొలి దశలోనే పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నది.
అప్పటికే విత్తనాలు రైతుల చేతికి అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చేరిపోతున్నాయి. సగం మొలకెత్తి, మొలకెత్తక, మొలకెత్తినా పూతలేక, పూతపూసినా కాత కాయకపోవడం, కాతకాసినా సరైన దిగుబడి ఉండదు. ఇవన్నీ రైతును తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. ఈ దుస్థితికి రైతులు బలైతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడం ఏటా పరిపాటిగా మారింది. ప్రత్యేక ఏజెంట్ల ద్వారా కల్తీ వ్యాపారులు వివిధ రూపాల్లో ఈ దందా సాగిస్తున్నారు. దీనిద్వారా ఏటా కోట్ల రూపాయల చీకటి వ్యాపారం సాగుతున్నది. విత్తన చట్టంలోని లోపమూ అక్రమార్కులకు అవకాశంగా మారిందనే అభిప్రాయం ఉంది.
పొరుగు నుంచి కల్తీ విత్తనాలు
రాష్ట్రంలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 50, 59,225 ఎకరాలుగా ఉన్నది. గత ఖరీఫ్ సీజన్ లో 44,77,937 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. జర్మినేషన్ లేని విత్తనాలను ప్యాకెట్లలో నింపి, వాటికి రకరకాల బ్రాండ్లు ముద్రించి రైతులను రకరకాల మాటలతో మాయచేసి ఈ కల్తీ విత్తనాలు అంటగడుతున్నారు. కర్నాటక నుంచి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, ఇటు ఏపీ, మహారాష్ట్రతో పాటు గుజరాత్ నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోకి ఈ కల్తీ విత్తనాలు చేరుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు తోడు లోకల్ స్థాయిలో ఉత్పత్తి చేసే పత్తి విత్తనాలకు రకరకాల బ్రాండ్లతో అంటగడుతున్నారు.
ఇందులో కొన్ని విత్తనాలు అదృష్టవశాత్తు రైతులకు కలిసి వస్తుండగా, జర్మినేషన్ లేని సమయాల్లో పత్తి పూత, కాతలేక రైతులు నష్టపోతున్నారు. పంట పండిన సందర్భాల్లో ఈ కల్తీ విత్తనాలను పెద్దగా రైతులుగానీ, వ్యాపారులు, ఏజెంట్లు పట్టించుకోరు. కానీ, కల్తీవిత్తనాలతో రైతులు నష్టపోయినప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది కూడా ఒకరొఇద్దరో కాకుండా కల్తీ విత్తన ఏజెంట్ల మాయమాటలు నమ్మి పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోయినప్పుడు మాత్రమే ఈ చీకటి దందాలు వెలుగు చూస్తున్నాయి.
అటు వ్యవసాయ అధికారులను, ఇటు విత్తనాలు అంటగట్టిన కల్తీ వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారు. వీటికి చట్టపరమైన చర్యల కంటే రైతులను రాజీకి తెచ్చి ఏదో మొక్కుబడి చెల్లింపులతో తమ అక్రమ దందాను బహిర్గతం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులకూ, పోలీసులకు ఈ వ్యవహారాలు తెలిసీనా పట్టించుకోకపోవడం కల్తీ వ్యాపారం సాగుతున్నదన్న విమర్శలున్నాయి. వ్యాపారులు, డీలర్ల అసోసియేషన్లు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలుంటున్నాయి.
రైతుల నుంచి రైతులకు
పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తికి కొందరు రైతులను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే కంపెనీల ఏజెంట్లు రైతులకు విత్తనసాగు కోసం విత్తనాలు అందజేస్తారు. విత్తనోత్పత్తి జరిగిన తర్వాత ఈ విత్తనాలు సదరు కంపెనీలు తీసుకెళ్ళి వాటి జెర్మినేషన్ పరిశీలించి, శుద్ధి చేసి ధృవీకరణ నిర్ణయించి విత్తనాలు రైతులకు అధికారికంగా విక్రయిస్తారు. కానీ, తమ ఏజెంట్ల ద్వారా రైతుల నుంచి విత్తనాలు సేకరించిన కొందరు విత్తనాల జర్మినేషన్, శుద్ధి తదితర అంశాలేవీ పట్టించుకోకుండా ఏదో కంపెనీ పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు విక్రయించడంతో కల్తీ విత్తనాలు నేరుగా రైతులకు చేరుతున్నాయి.
సీజన్ కు ముందే రైతుల వద్దకు
ప్రభుత్వం, అధికారిక కంపెనీలు డీలర్లు, డిస్ర్టిబ్యూటర్ల ద్వారా పత్తి విత్తనాలు రైతులకు మే, జూన్ నెలల్లో పంపిణీ చేస్తుండగా కల్తీ విత్తనాలు మాత్రం నెల రోజుల ముందుగా రైతుల ముగింట చేరిపోతున్నాయి. రాష్ర్టంలో ప్రభుత్వం సర్టిఫై చేసిన మేలు రకం పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రామాలు) ఒకటి రూ.740 నుంచి రూ.860 వరకు దొరుకుతుండగా, నిషేధిత, కల్తీ బీటీ–-3 కిలో విత్తనాలను డిమాండ్ను బట్టి వ్యాపారులు రూ.1,300 నుంచి రూ.1,500 వరకు అమ్ముతున్నారు. ఎక్కువ ధరతో పాటు నాణ్యత గ్యారంటీలేని విత్తనాలు రైతులపొలాల్లోకి సరాసరి చేరుతున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయశాఖ మాత్రం మే చివరి వారం, జూన్ తొలకరి రోజుల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు ప్రయోగిస్తామంటూ ప్రకటించడం రివాజుగా మారింది.
కఠిన చర్యలు చేపట్టకుంటే నష్టం
పత్తి సాగు రోజురోజుకు పెరుగుతున్నందున కల్తీ విత్తనాలు, జర్మినేషన్ సక్రమంగా లేని విత్తనాలు రైతులకు చేరకుండా వ్యవసాయ శాఖ, నిఘా వర్గాలు, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పత్తి సాగుకు రెండు నెలల ముందు నుంచే నిఘా పెట్టి కఠిన చర్యలు చేపడితే ఈ కల్తీ బారి నుంచి రైతులను కాపాడవచ్చు అంటున్నారు. రైతు కమిటీలను ఇందులో భాగస్వామ్యం చేస్తే చాలావరకు దీన్ని అరికట్టవచ్చని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు సకాలంలో వస్తాయనే వార్తల నేపథ్యంలో పత్తి రైతులు విత్తనాలు వేసేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పత్తి రైతులు విత్తనాల కోసం ఎగబడుతున్నారు. నాణ్యమైన విత్తనాలు సకాలంలో రైతులకు అందించకుంటే కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టే అక్రమవ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం విత్తన కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతుల నుంచి డిమాండ్ ఉన్న కంపెనీ విత్తనాలు లభించని సమయంలో కూడా రైతులు ఇతర వాటిపై మొగ్గుచూపుతున్నారు.ఈ సమయంలో రైతుల ఆశను దృష్టిలో పెట్టుకుని తమ అక్రమవ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.