హైదరాబాదులో శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని సీపీఐ పార్టీ స్వాగతిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు
పునర్విభజన సమస్యలు పరిష్కారం కావాలి
ఐదు గ్రామాలు తిరిగి ఇవ్వాలి
విధాత, హైదరాబాద్: హైదరాబాదులో శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని సీపీఐ పార్టీ స్వాగతిస్తుందని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఉన్న సమస్యల సత్వర పరిష్కారానికి ఈ సమావేశం నాంది కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భద్రాచలంలో ఐదు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇచ్చే విషయంలో సానుకూలతకు రావడం ద్వారా ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశం మంచి సంకేతాలు పంపాలని విజ్ఞప్తి చేశారు.
పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయినా , ఇంకా సమస్యలు కొనసాగడం బాధాకరమని, ఇందుకు కేంద్ర, గత రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణం అని విమర్శించారు. చర్చల ద్వారా తప్ప వివాదాల ద్వారా సమస్యలకు త్వరిత పరిష్కారం లభించదని, కాబట్టి నిర్దిష్ట కాల పరిమితి లోగా పరిష్కారానికి వచ్చేలా ముఖ్యమంత్రుల సమావేశంలో ఏకాభిప్రాయానికి రావాలని కూనంనేని సూచించారు.
తిరుమలలో తెలంగాణ రాష్ట్రాల ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అనుమతించాలి
తిరుమల తిరుపతి దేవస్థానం భౌతికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా రెండు తెలుగు రాష్ట్రాల దేవాలయమని, వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్రాల ఆరాధ్య దైవంమని కూనంనేని స్పష్టం చేశారు. ఉత్తరాదిలో అయోధ్య దేవాలయానికి ఎంత ప్రాతిష్టమున్నదో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అంతా ప్రాతిష్టమున్నదని, ఇక్కడికి ప్రపంచ దేశాల నుండి భక్తులు వస్తారని గుర్తు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సులు తిరుమలలో చెల్లకపోవడం దురదృష్టకరమని, దైవదర్శనానికి వచ్చే తెలంగాణ ఎంఎల్ఎల నుండి వచ్చే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకొని, దైవం దగ్గర బేధాభిప్రాయం లేకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంటుందని కూనంనేని పేర్కోన్నారు.