రాజ్యాంగం. రక్షింపబడాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షించాబడాలన్నా కేంద్రంలో బీజేపీని సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు
అవినీతిపరులంతా బీజేపీలోనే చేరారు
ప్రజల దృష్టిమరల్చేందుకే రామాలయం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు
విధాత, వరంగల్ ప్రతినిధి: రాజ్యాంగం. రక్షింపబడాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షించాబడాలన్నా కేంద్రంలో బీజేపీని సాగనంపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హనుమకొండ సీపీఐ జిల్లా కార్యాలయంలో ‘మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం’ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే చట్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్ష తరహా పాలనకు ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని హిందూ దేశంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.
నేడు దేశంలో అవినీతి పరులంతా బీజేపీ లోనే ఉన్నారని, విపక్షాల నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ లను ప్రయోగించి లొంగదీసుకుని బీజేపీ లోకి చేర్చుకుని క్లీన్ చీట్ ఇస్తున్నారని అన్నారు. వీటి నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే రామాలయం, సీఏఏ, హిందూత్వం పేరుతో ప్రజలను మభ్యపెటుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయని అన్నారు.
బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్ లను ఎత్తివేయడం ఖాయమని, అలాంటి పెత్తందారుల పార్టికి దళిత, గిరిజన వర్గాలు,పేదలు గుణపాఠం చెప్పాలన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికలలో ఇంటికి సాగనంపాలని కోరారు. అలాగే ఏఐటియూసి జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, డీహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, ఏఐటియూసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల సారంగపాణి, జక్కు రాజు గౌడ్, నాయకులు కర్రె లక్ష్మణ్, మనిగాల బిక్షపతి, కొట్టపాక రవి, అంబి సాంబయ్య, బత్తిని సదానందం, గుంటి రాజేందర్, దామెర సుదర్శన్, శనిగరపు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.