కొడంగల్లో ఫార్మా కంపెనీలకు భూములివ్వాలని బెదిరిస్తున్నారు..కేటీఆర్ ను కలిసిన బాధిత రైతులు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని...ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని…ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మహిపాల్ ముదిరాజ్లతో కలిసి వారు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్ కు వివరించారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తమకు బీఆరెస్ పార్టీ అండగా నిలవాలని కేటీఆర్ ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారమని, ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న కేటీఆర్ తప్పకుండా ఈ విషయంలో బీఆరెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.