విధాత: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాంతో జనం విపరీతమైన ఉక్కపోత, చెటమటతో అల్లాడుతున్నారు. గతవారం రోజుల నుంచి ఎండలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరో వైపు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2°C నుండి 3°C వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు క్రింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి వీస్తాయని, అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రత వలన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.