విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలనపడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం గా ఉందని, రాహుల్ కు ఏకైక అర్హత వారస్వతమే అంటూ సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట బీఆరెస్ కార్యాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ములుగు సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రాహుల్ కు ఉన్న ఏకైక అర్హత వారసత్వమే అని పేర్కొన్నారు. కుంభకోణాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పగలు దొంగతనం చేస్తూ దొరికిపోయిన పగటి దొంగ రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్ చదువుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష కోట్ల లోపే ఉంటుందని, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం అన్నారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు.
మోడీ దయాదాక్షిణ్యల మీద బతుకుంది గాంధీ కుటుంబం అన్నారు. బోఫోర్స్ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చరిత్ర గాంధీ కుటుంబానిది అంటూ మంత్రి మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో అటువైపు చూడకపోవడమే కాంగ్రెస్, బీజేపీ లాలూచీ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక నే, నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతుర్రు అని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ బతుకు నాశనం అయ్యిందంటూ విమర్శించారు. కేసీఆర్ మీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మివేయడమే అన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలం అయిందని అన్నారు. ఏ యాత్రనూ చివరి వరకు ముగించిన చరిత్ర రాహుల్ కు లేదన్నారు. ఇలాంటి యాత్రలు బీఆర్ఎస్ జైత్రయాత్ర ను అపలేవన్నారు.
తెలంగాణా లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఐదుగంటల కరెంట్, రైతులు పండించిన ధాన్యం కూడా కొనలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ది అన్నారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ, తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ది అన్నారు.
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి, తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాల వెంకటనారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్,నాయకులు గండూరి ప్రకాష్ పాల్గొన్నారు.