విద్యార్థులు పోటీ పరీక్షలలో ప్రావీణ్యత సాధించడానికి ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల
విధాత బ్యూరో, కరీంనగర్: విద్యార్థులు పోటీ పరీక్షలలో ప్రావీణ్యత సాధించడానికి ప్రత్యేకంగా నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుత్తిల్లా శ్రీధర్ బాబు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో
ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఎన్నికల నియమావళి కారణంగా ఆలస్యం జరుగుతున్నదని అన్నారు. ప్రతి కోచింగ్ సెంటర్ లో ఆడియో,వీడియో మాధ్యమాల ద్వారా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిని పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరున ఈ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ తీసుకొన్నారని చెప్పారు.
కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని తమకు అనుగుణంగా మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత పది సంవత్సరాల పాలనలో అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా,అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రంలో నవసమాజం, సమానత్వం లక్ష్యాలతో పాలన సాగుతోందని శ్రీధర్ బాబు తెలిపారు.