Thummala Nageswara Rao : రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు
రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యాసంగి సీజన్లో 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు.
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేశామన్నారు. ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికమన్నారు. యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను, ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగామని తెలిపారు. రైతులకు అవసరమున్నంతమేరకు యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 12000 సెంటర్లలో, ఎక్కడో 2,3 సెంటర్లలో ఉన్న వరసలను చూపి రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారని బీఆరెస్ నేతలనుద్దేశించి మంత్రి అన్నారు. ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సందర్భాలను చూపి యూరియా కొరత అని ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని అనుకుంటే రైతులు క్షమించరన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన సందర్భాల గురించి నేను మాట్లాడదల్చుకోలేదనిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన కిసాన్ యాప్ ను రాష్ట్రంలో కూడా అమలు చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. ఆ యాప్ ను ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారన్నారు. వారంతా ఈ యాప్ ను ఉపయోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు.
యాప్ ద్వారా యూరియా అమ్మకాలను 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు. నేను స్వయంగారైతులతో మాట్లాడితే వారంతా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేది నుండి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారన్నారు. కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొన్నామని మంత్రి సభకు వివరించారు. యాప్ మీద కూడా లేని పోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్ట కరమన్నారు. ఈ యాప్ ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించామని, ప్రతి రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
యాసంగి సీజన్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు యూరియా విక్రయాలు ఇలా..
సంవత్సరం లక్షల మెట్రిక్ టన్నులు
2018–19 2.57
2019–20 2.42
2020–21 1.22
2021–22 1.75
2022–23 2.63
2023–24 2.17
2024–25 3.04
2025–26 4.04
ఇవి కూడా చదవండి :
YouTuber Anvesh : యూట్యూబర్ అన్వేష్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? అతడిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి?
Komati Reddy : కన్ఫ్యూజన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram