Thummala Nageswara Rao : రాష్ట్రంలో స‌మృద్ధిగా యూరియా నిల్వ‌లు

రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యాసంగి సీజన్‌లో 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు.

Thummala Nageswara Rao : రాష్ట్రంలో స‌మృద్ధిగా యూరియా నిల్వ‌లు

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. శుక్ర‌వారం శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇస్తూ ​డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేశామ‌న్నారు. ​ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని, ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికమ‌న్నారు. ​యాసంగిలో డిసెంబర్ వరకు కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు ​గాను, ​ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగామని తెలిపారు. ​రైతులకు అవసరమున్నంతమేరకు యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ​రాష్ట్రంలో ఉన్న 12000 సెంటర్లలో, ఎక్కడో 2,3 సెంటర్లలో ఉన్న వరసలను చూపి ​రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారని బీఆరెస్ నేత‌ల‌నుద్దేశించి మంత్రి అన్నారు. ​ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సంద‌ర్భాల‌ను చూపి ​యూరియా ​కొరత అని ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ​అనుకుంటే రైతులు క్షమించరన్నారు. ​గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన ​సందర్భాల గురించి నేను మాట్లాడదల్చుకోలేదనిచెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది తీసుకొచ్చిన కిసాన్ యాప్ ను రాష్ట్రంలో కూడా ​అమలు చేశామ‌ని మంత్రి తుమ్మ‌ల చెప్పారు. ​ఆ యాప్ ను ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నార‌న్నారు. వారంతా ఈ యాప్ ను ఉప‌యోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు.

యాప్ ద్వారా యూరియా అమ్మ‌కాల‌ను 5 జిల్లాలలో ​ప్రయోగాత్మకంగా ​చేపట్టామ‌న్నారు. నేను స్వ‌యంగారైతులతో మాట్లాడితే వారంతా సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు. ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటిని ​ఒక్కొక్కటిగా ​పరిష్కరించామ‌న్నారు. యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేది నుండి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు ​3.36 ​లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారన్నారు. కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకొన్నామ‌ని మంత్రి స‌భ‌కు వివ‌రించారు. ​యాప్ మీద కూడా లేని పోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు ​చేయడం దురదృష్ట క‌ర‌మ‌న్నారు. ​ఈ యాప్ ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించామ‌ని, ​ప్రతి రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

యాసంగి సీజ‌న్‌లో అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు యూరియా విక్ర‌యాలు ఇలా..
సంవ‌త్స‌రం ల‌క్ష‌ల‌ మెట్రిక్ ట‌న్నులు
2018–19 2.57
​2019–20 2.42
2020–21 1.22
2021–22 1.75
2022–23 2.63
2023–24 2.17
​2024–25 3.04
2025–26 4.04

ఇవి కూడా చదవండి :

YouTuber Anvesh : యూట్యూబర్ అన్వేష్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? అతడిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి?
Komati Reddy : క‌న్ఫ్యూజ‌న్ లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత