బాధ్యతలు స్వీకరించిన మంత్రులు

తెలంగాణ మంత్రులు పలువురు గురువారం తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ మంత్రులు పలువురు గురువారం తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్‌లలో వారంతా ప్రత్యేక పూజల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించి పలు శాఖలకు సంబంధించిన సబ్సిడీలను విడుదల చేస్తూ ఫైళ్లపై సంతకం చేశారు.


ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్‌స్కో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరితతోపాటు పలువురు అధికారులు భట్టికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహప్రవేశం చేశారు.


గృహప్రవేశం సందర్భంగా జరిగిన హోమంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోగ్య, సైన్స్ ఆండ్ టెక్నాలాజీ మంత్రిగా దామోదర రాజనర్సింహా, రెవిన్యూ, హౌజింగ్‌, సమాచార శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.



33 జిల్లాల డీపీఆర్‌ఓలకు అధునాతన కెమెరాలు అందించే ఫైల్‌పై పొంగులేటి సంతకం చేశారు. భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్ కాంప్లెక్సుకు 10 ఎకరాల భూమి (రూ.9.50 కోట్ల విలువ) కేటాయిస్తూ సంతకం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ధనసరి అనసూయ (సీతక్క) కూడా బాధ్యతలను స్వీకరించారు.



బాధ్యతలు స్వీకరించిన మంత్రులుకొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడా అధికారిక కార్యక్రమాల్లో సమీక్షల్లో నిన్నటి వరకు కనిపించని ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ నిన్న సీఎం అధ్యక్షతన జరిగిన రివ్యూ మీటింగ్‌ హాజరుకాగా, ఈ రోజు సీతక్క బాధ్యతల స్వీకార కార్యక్రమంలో కనిపించారు. సాగునీటిపారుదల, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక ఫైళ్ళపై సంతకాలు చేశారు