MP Chamala Kiran Kumar Reddy | సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై బీఆరెస్ దుష్ప్రచారం: ఎంపీ చామల

తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సమీకరణకు ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటనపై బీఆరెస్ రాజకీయ దుష్ప్రచారం చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు

MP Chamala Kiran Kumar Reddy  | సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనపై బీఆరెస్ దుష్ప్రచారం: ఎంపీ చామల

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల సమీకరణకు ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటనపై బీఆరెస్ రాజకీయ దుష్ప్రచారం చేస్తుందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మీడియ సమావేశంలో చామల మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మమ్మల్ని తప్పుబడుతూ ఎలా బద్నాం చేయాలనే ఆలోచనతోనే బీఆరెస్ నాయుకలు ముందుకెళ్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే అందర్నీ ఆహ్వానిస్తున్నామని, గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారాలకు అనుమతులు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం.. సంపద పెంచడమే మా లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల సాధన ప్రయత్నాలను విమర్శిస్తున్న బీఆరెస్ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో కేటీఆర్ విదేశాల్లో పర్యటించి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని చామల కిరణ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేటీఆర్ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారని నిలదీశారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని, తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వనరులను వాడుకోకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. బీఆరెస్‌ పార్టీ నేతలు ప్రజల్ని మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.