ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు, మంచినీటి కొరత లేదంటూ..ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నామ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడటం విడ్డూరంగా ఉందని యూనివర్సిటీ హాస్టల్స్ విద్యార్థి నేత నాగేందర్ విమర్శించారు
విధాత, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు, మంచినీటి కొరత లేదంటూ..ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నామ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడటం విడ్డూరంగా ఉందని యూనివర్సిటీ హాస్టల్స్ విద్యార్థి నేత నాగేందర్ విమర్శించారు. భట్టి ఎక్కడో ఉండి యూనివర్సిటీ హాస్టల్స్లో కరెంటు, నీళ్ల సమస్యలు లేవని చెప్పడం కంటే ఇక్కడి వచ్చి హాస్టళ్లను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి నిజాలు తెలుసుకుంటే మంచిదన్నారు. భట్టి వ్యాఖ్యలు ఉస్మానియా విద్యార్థులు అబద్ధాలు చెప్పినట్లుగా ఉందన్నారు. లేడీస్ హాస్టల్ విద్యార్థినిలు సైతం తమకున్న కరెంటు, మంచినీటి సమస్యలపై రోడ్డెక్కి మరి నిరసన తెలిపిన విషయం మరువరాదన్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే హాస్టల్కు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థినేతగా చెప్పుకుని ఎమ్మెల్సీ పదవి సాధించి పైలట్ కార్లలో తిరుగుతున్న బల్మూరి వెంకట్ ఇప్పుడెక్కడున్నాడని, ఆయనకు విద్యార్థి సమస్యల పట్ల ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని డిమాండ్ చేశారు.