తెలంగాణలో బీజేపీ 12 స్థానాలు గెలిస్తే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తామని ఆ పార్టీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా చెబుతున్నారు. తెలంగాణలో ఏబీసీ (అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్) ఒక్కటయ్యాయని అన్నారు.
పాత బస్తీ, భైంసా లేకుండా బీజేపీ ప్రచారం చేయగలదా?
యూపీలో ఎంఐఎం పోటీతో లబ్ధి కలిగిందెవరికి?
తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ
ఆ పార్టీ ‘విమోచన’ దినం గురించి ప్రశ్నించడమా?
బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి చేసిందేంటి?
(విధాత ప్రత్యేకం)
తెలంగాణలో బీజేపీ 12 స్థానాలు గెలిస్తే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తామని ఆ పార్టీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా చెబుతున్నారు. తెలంగాణలో ఏబీసీ (అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్) ఒక్కటయ్యాయని అన్నారు. ముస్లింల కోసం శ్రీరామ నవమి శోభాయాత్రను అడ్డుకున్నాయని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కూడా అమిత్షా ఆరోపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్లలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించిన అమిత్ షా సహా ఆ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో పాతబస్తీ, భైంసా వంటి అంశాల ప్రస్తావన లేకుండా ఓట్లు అడగగలరా? అని ప్రశ్నిస్తున్నారు.
యూపీలో ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఏ పార్టీకి లబ్ధి జరిగిందో అంకెలే చెబుతాయని పేర్కొంటున్నారు. ఆ పార్టీ తెలంగాణ బయట పోటీ చేసే చోట అక్కడి ప్రతిపక్షాల ఓటు బ్యాంకును చీల్చి పరోక్షంగా బీజేపీ గెలువడానికి దోహదపడుతున్నదని అఖిలేశ్, తేజస్వీ లాంటి నేతలు విమర్శించారు. దీన్నిబట్టి ఎవరికి ఎవరు సహకరించుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాగే కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల కాలం నుంచి స్వరాష్ట్రం వరకు ఎన్నడూ తెలంగాణలో విద్వేష రాజకీయాలకు తావు లేదు. హిందూ, ముస్లింలు గంగా జమునా తెహజీబ్ వలె కలిసి మెలిసి ఉన్నారు. హైదారాబాద్ లాంటి మహానగరంలో హిందూ, ముస్లింలే కాదు దేశంలోని అనేక మతాల వాళ్లు నివసిస్తున్నారు. బయటి శక్తుల కుట్ర చేసిన సందర్భాలు మినహా ఇక్కడ నిత్యం ప్రశాంత వాతావరణమే ఉండేది.
ఇక్కడి ప్రజలంతా అన్ని మతాల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తారు. సోదరభావంతో కలిసి మెలిసి నిర్వహించుకుంటారు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు తెలంగాణను ముస్లిం రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయం కోసమే అన్నది అందరికీ తెలిసిందే. ఇక నిత్యం రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే బీజేపీ నేతలు భద్రాచలం దేవాలయ అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వకపోగా పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి కట్టబెట్టారు. దానివల్ల ఇప్పుడు భద్రాద్రి ఆలయ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. పోలవరం పూర్తయితే భద్రాచలం గుడికి ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ
భారత సైన్యాలకు నిజాం లొంగిపోయిన రోజున ఉత్సవాలు చేయడం లేదని అంటున్నారు. స్వాతంత్ర్య, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సంబంధం లేని బీజేపీ వాళ్లు దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ చరిత్రలో రైతాంగ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆ పోరాటం చేసింది, త్యాగాలు చేసింది కమ్యూనిస్టులు. ప్రాణాలు అర్పించింది కూడా వాళ్లే. అలాంటి వాళ్ల పోరాటాన్ని అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతలు చెబుతున్న ‘విమోచన’ దినోత్సవం గురించి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మాటల్లో చెప్పాలంటే ఎవరి నుంచి ఎవరికి విమోచనం? నిజాం వ్యతిరేక పోరాటం జరిగింది వాస్తవం. కానీ ఆ పోరాటం 1948 సెప్టెంబర్ 17తోనే ముగిసిపోలేదు. 1951 వరకు జరిగింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వల్లనే హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి అంటున్నారు. ఆయన హోం మంత్రిగా ఉండగానే నిజాంను రాజప్రముఖ్గా గుర్తించింది నాటి కేంద్ర ప్రభుత్వం కాదా? ఆయనతో యథాతథ ఒప్పందం చేసుకున్నది భారత ప్రభుత్వం కాదా? వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే విమోచన దినోత్సవం గురించి మాట్లాడం పరిపాటిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీకి అసలు ఓటెందుకు వేయాలి?
తెలంగాణ ప్రజలు అసలు బీజేపీ ఎందుకు ఓటు వేయాలన్నదే అసలు ప్రశ్న. నలుగురు ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చారా? విభజన హామీలను నెరవేర్చారా? గత ఎన్నికల్లో గెలువడానికి అనేక హామీలు ఇచ్చిన ఆ పార్టీ ఎంపీలు ఇప్పుడు వాటి గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసే పరిస్థితి నెలకొన్నది. అందుకే గతంలో గెలుచుకున్న నాలుగు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడమే ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారిందని రాజకీయ పరిశీలకకులు చెబుతున్నారు.
అందుకే జహీరాబాద్, వరంగల్, మహబూబాబాద్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్, నల్లగొండ లోక్సభ స్థానాలకు అభ్యర్థులు కరువైన కాషాయపార్టీ బీఆర్ఎస్ నుంచి తెచ్చుకునే దుస్థితి నెలకొన్నదని అంటున్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం జరుగుతున్నదని చెబుతున్నారు. దీనికి అమిత్ షా ఏం సమాధానం చెబుతారో మరి! తెలంగాణలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు..