Minister Uttam Kumar Reddy | చేవెళ్ల-ప్రాణహిత పనులు పునరుద్దరిస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పనులను పునరుద్దరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖ ఆధ్వ‌ర్యంలోని ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్‌ను అందిస్తామని, ఇందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ‌ భూములలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 11, 2025 11:45 PM IST
Minister Uttam Kumar Reddy | చేవెళ్ల-ప్రాణహిత పనులు పునరుద్దరిస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి Pranahita Chevella Lift Irrigation Project Works Restart
  • చేవెళ్ల-ప్రాణహిత పనులు పునరుద్దరిస్తాం
  • తుమ్మిడిహట్టి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం
  • నీటిపారుదల అవసరాలకు సోలార్ విద్యుత్
  • స‌మీక్ష‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌11 (విధాత‌): చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు పనులను పునరుద్దరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖ ఆధ్వ‌ర్యంలోని ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్‌ను అందిస్తామని, ఇందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ‌ భూములలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

శ‌నివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ‌ ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ప్రతిపాదన ప్రకారం తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి ద్వారా చేవెళ్ల‌కు నీరు అందించే యోచన చేస్తున్నామన్నారు.

తుమ్మిడిహట్టి నుండి 71 కిలోమీటర్ల మేర దూరం ఉన్న కాల్వ పనులలో ఇప్పటికే 45 కిలోమీటర్ల దూరం పూర్తి అయ్యాయన్నారు. 71 కిలోమీటర్ పాయింట్ నుండి అంటే మంచిర్యాల జిల్లా మైలారం గ్రామ సమీపం నుండి నీటిని తరలించడానికి రెండు మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు.

అందులో మొదటిది పాత ప్రణాళిక ప్రకారం మైలారం నుండి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఒక లిఫ్ట్ అవసరం ఉంటుందని గుర్తించామన్నారు. రెండోది అదే పాయింట్ నుండి సుందిళ్ల బ్యారేజ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం వరద కాలువ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉందన్నారు.

రెండు మార్గాలు కూడా ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ఖర్చుతో అయ్యేలా అధికారులు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌పై స్పందించిన మంత్రి రెండు మార్గాలకు వెంట‌నే డీపీఆర్‌లను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని మంత్రి చెప్పారు.

నీటిపారుదల శాఖకు చెందిన భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి తెలిపారు. ఇక పై విద్యుత్ తో నడిచే నీటిపారుదల శాఖ‌ ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్ ను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎత్తిపోతల పథ‌కాలకు సోలార్ విద్యుత్ ను వినియోగించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. అందుకు నీటిపారుదల శాఖ‌ భూములలో సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాల‌న్నారు. అదే విధంగా దేవాదుల ప్యాకేజ్ 3, కల్వకుర్తి ప్యాకేజీ 29, పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజ్ 7, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తదితర ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు.

ఎస్ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ఏరియల్ సర్వే పనులను వేగవంతం చేయాలని అధికారుల‌కు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం, బనకచర్ల ప్రాజెక్టు అంశాలపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ‌ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ స‌మీక్ష‌లో నీటిపారుదల శాఖ‌ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్య నాధ్ దాస్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.